Begin typing your search above and press return to search.

గడప గడప : వామ్మో ...కధ క్లైమాక్స్ కి చేరుతోందా...?

By:  Tupaki Desk   |   22 May 2022 2:30 AM GMT
గడప గడప :  వామ్మో ...కధ క్లైమాక్స్ కి చేరుతోందా...?
X
రావాలీ జగన్. కావాలి జగన్. ఈ మాట. ఈ నినాదం ప్రతీ చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉంది. అలాంటిది కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే పోవాలి జగన్ అంటూ విపక్షాలు అంటున్నాయి అంటే ఏమో అది ఫక్తు రాజకీయం అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు జనాలే ఆ మాట అంటూంటే ఏమిటీ వైపరిత్యం, హత విధీ అని వైసీపీ వారే చెవులు మూసుకునే పరిస్థితి.

గడప గడపకూ వెళ్లి జనాల గోడు విందామనుకునే వారికి అనేక అశుభాలు ఎదురవుతున్నాయి. అంతే కాదు, అవమానాలు కూడా బహుమానాలుగా దక్కుతున్నాయి. మా గడపకు వద్దు, అసలు రావద్దు అంటూ జనాలు ఏకంగా ఆవేశాలతో శాపనార్ధాలే పెడుతున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే సీమ జిల్లాల కధ సీన్ ఇలాగే అచ్చంగా ఉంటోంది.

మీరు ఏం చేశారని ఇపుడు తాపీగా వస్తున్నారు అంటూ కసురుకుంటున్నారు. అదే టైమ్ లో మీరు ఏం చేశారని మళ్ళీ గడప తొక్కుతున్నారు అని కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు ఇంటి గడప కాదు కాదా ఊరు పొలిమేర దాకా కూడా చేరలేకపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అయితే జి సిగడాం మండలలోని విజయరామపురంలో గ్రామం హద్దులను దాటలేకపోయారు.

వద్దు సారూ ఇక జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోండి అంటూ గ్రామం మొత్తం వచ్చి మరీ ఎమ్మెల్యే కారుని అలా వెనక్కి తిప్పి పంపించేసిన ఘటన చూస్తే కచ్చితంగా ఇంతకంటే ప్రజాగ్రహం వేరేగా ఉంటుందా అని అంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీకీ ఈ రోజూ దిక్కు లేదు, తాగు నీరు, పించన్లు, మంచి నీరు ఇలా చాలా విషయాలల్లఒ ఏమి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలను జనాలు నిలదీస్తున్న దృశ్యాలు దర్శనం ఇస్తున్నాయి.

ఇంకో వైపు చూస్తే మాకొద్దీ ప్రభుత్వం అంటూ జగన్ కి వ్యతిరేకంగా జనాలు నినాదాలు చేయడం కూడా జి సిగడాం టూర్లో స్వయంగా ఎమ్మెల్యే చెవిన సోకిన వైనాలు వైసీపీకి అశుభ శకునాలుగా మారుతున్నాయి. ఇక విశాఖ జిలా వైసీపీ ప్రెసిడెంట్ ఆయన. నిన్నటి దాకా మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాసరావుకు సొంత నియోజకవర్గం భీమిలీలో అయితే అడుగడుగునా జనాల నుంచి నిలదీత‌లు ఎదురవుతున్నాయి.

మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చిన్నాపురంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మహిళ ఒకరు ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఏడాది అయినా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇల్లు నిర్మాణం అయింది అయినా మాకు డబ్బులు ఇవ్వరా ఆమె మాజీ మంత్రి గారిని ముఖం మీదనే అడిగేశారు. ఆయన అధికారుల వైపు చూసి చెప్పమంటే వారిని కూడా కడిగిపారేశారు. అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగాయని ఆమె అంటూంటే ఏమీ చెప్పేది లేక అవంతి సార్ అక్కడ నుంచి బయటపడ్డారని చెబుతున్నారు. అలాగే భీమిలీ ఆనందపురం మండలాల పర్యటనలో కూడా ఇదే రకమైన నిరసనలు మాజీ మంత్రికి ఎదురయ్యాయ‌ని చెబుతున్నారు.

ఇంకో వైపు చూస్తే పశ్చిమ గోదావరి జిలాల్లో గడప గడపకూ ఇలా సీన్లే సీన్లు అన్నట్లుగా ఉంది. ఉండి మండలం కోలమూరు గ్రామంలో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజుకు జనాల నుంచి సెగ గట్టిగానే తగులుతోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించే ప్రయత్నం చేస్తూంటే ముందు మా సమస్యల సంగతి చెప్పండి రాజు గారూ అని మహిళలు గట్టిగా నిలదీయడం విశేషం. ఇక్కడ కూడా వింతతు పించన్లు రాలేదని, సామాజిక పించన్లు రాలేదని మహిళల గోడు విని వైసీపీ నాయకులు జవాబు చెప్పేలేక తప్పుకుని పోతున్నారు.

మీరు మీరు బాగానే ఉంటారు, మీరు వచ్చినా మాకేమీ జరగలేదు, మా సమస్యలు అలాగే ఉన్నాయి అని జనాలు మండిపడుతూంటే గడప గడప కాదు, ఒక్క గడప వద్దనే తమ పర్యటన ఆపేసుకుని నేతాశ్రీలు వెనుదిరుగుతున్నారు. మొత్తానికి చూస్తే మొదట స్థానిక నేతల మీద ఆగ్రహం అని అంతా అనుకున్నారు. కానీ చూడబోతే మూడేళ్ళ వైసీపీ పాలన మీదనే జనాలు మండుతున్నారని గడప గడప కళ్ళకు కడుతోంది. దాంతోనే సీఎం జగన్ డౌన్ డౌన్ అన్న నినాదాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి చూడబోతే కధ కంచిని చేరుతోందా అన్న డౌట్లు వైసీపీ నేతలకు కలుగుతున్నాయట. చూడాలి మరి గడప గడపకు ఏ విధంగా వైసీపీ నేతలు చేరుతారో.