Begin typing your search above and press return to search.

అధికారంలోకి మోడీ.. అంత‌ర్జాతీయంగా అదానీ.. రాజ‌కీయ చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   17 May 2022 10:30 AM GMT
అధికారంలోకి మోడీ.. అంత‌ర్జాతీయంగా అదానీ.. రాజ‌కీయ చ‌ర్చ‌!
X
అదానీ! ఈ పేరు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తోంది. కార్పొరేట్ దిగ్గ‌జాల్లో గౌతం అదానీ ఒక‌రు. ఏపీలో ఓడ‌రేవుల‌ను ఆయ‌న కొనుగోలు చేశారు. అదేవిధంగా అటు ప‌లు రాష్ట్రాల్లోనూ వేళ్లూనుకున్నారు. అయితే.. అదానీ అస‌లు ఎప్పుడు వ్యాపార రంగంలోకి వ‌చ్చారు? ఇప్పుడుదేశ‌వ్యాప్తంగా ఎలా ఎదిగారు అనేది ఆస‌క్తిదాయకం. ఎందుకంటే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతే.. ఆయ‌న ఎదుగుద‌ల ప్రారంభం అయింద‌నేది విప‌క్షాల విమ‌ర్శ‌. నిజానికి వాస్త‌వాలు గ‌మ‌నించినా.. ఇది క‌నిపిస్తోంది.

ఖ‌చ్చితంగా 8 సంవ‌త్స‌రాల కింద‌ట‌(అంటే.. మోడీ అధికారంలోకిరాక‌ముందు.. అదానీ కేవ‌లం గుజ‌రాత్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన వ్యాపార వేత్త‌.)కు ఇప్ప‌టికీ ఆయ‌న వ్యాపారాలు తాజా జువ్వ‌ల్లా నింగికెగిశాయి. గ‌తం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌క‌పోయినా.. 2014 నుంచి ఇప్ప‌టి వ‌రకు అదానీ పుంజుకున్న తీరు.. ఆయ‌న వ్యాపారాలు ఎగిసిన తీరు.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. అయితే.. అదాని వెనుక మోడీ ఉన్నార‌ని, ఆయ‌న ప్రోత్సాహంతోనే ఇలా పుంజుకున్నార‌ని.. విప‌క్షాలు అంటున్నాయి.

8 ఏళ్ల‌లో అదానీ వ్యాపారం పుంజుకున్న విధం ఇదీ..

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజార్టీ వాటా.. నౌకాశ్రయాలు, విద్యుత్‌, సిమెంటు రంగాల్లో హవా.. ఇదీ 2014 నుంచి గౌతమ్ అదానీ ప్రస్థానం. ఆసియా అపర కుబేరుడిగా ఎదిగిన అదానీ.. 2014 నుంచి తన సామ్రాజ్యాన్ని ప్రధానంగా 'కొనుగోళ్ల' ద్వారానే విస్తరించారు. వాటిల్లో ఏమేం ఉన్నాయంటే..

ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు తన సామ్రాజ్య విస్తరణకు సంస్థల 'కొనుగోళ్ల'నే ప్రధాన మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 2014 నుంచి వివిధ రంగాల్లో 30కి పైగా సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా, ప్రముఖ స్థానం పొందడమే ఇందుకు నిదర్శనం. ఈ విధంగానే అత్యంత కీలకమైన విమానాశ్రయాలు, ఇంధనం, నౌకాశ్రయాలు, సిమెంటు రంగాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అదానీ గ్రూపు ఎదిగింది.

సిమెంటు: అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ సంస్థల్లో స్విస్‌ సంస్థ హోల్సిమ్‌ లిమిటెడ్‌కు ఉన్న నియంత్రిత వాటాను 10.5 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.81,361 కోట్లు) కొనుగోలు చేయడం ద్వారా, ఏడాదికి 70 మిలియన్‌ టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం అదానీ గ్రూప్‌నకు సమకూరుతోంది. ఫలితంగా ఈ విభాగంలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ 119.95 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ తయారీ సామర్థ్యంతో మొదటి స్థానంలో ఉంది.

గ్యాస్‌: అంతర్జాతీయ దిగ్గజ సంస్థ టోటల్‌ గ్యాస్‌తో కలిసి అతిపెద్ద సిటీ గ్యాస్‌ పంపిణీ సంస్థగా అదానీ టోటల్‌ గ్యాస్‌ ఉంది.

విమానాశ్రయాలు: దేశంలోనే రద్దీపరంగా రెండోస్థానంలో ఉన్న ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజార్టీ వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. నవీ ముంబయి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, జైపూర్‌, తిరువనంతపురం, గువాహటి, మంగళూరు నగరాల్లోని విమానాశ్రయాల నిర్వహణ 50 సంవత్సరాల పాటు అదానీ గ్రూపు చేతికి చేరింది.

విద్యుత్తు: బొగ్గు, పునరుత్పాదక, గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తిలో వ్యాపారాలను అదానీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. 5.4 గిగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థగా నిలిచింది. వివిధ సంస్థల కొనుగోళ్ల ద్వారానే ఈ వృద్ధిని సాధించింది. 6 థర్మల్‌ పవర్‌ ప్లాంట్లతో 12.41 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ గ్రూపు కలిగి ఉంది. వీటిల్లో చాలా వరకు కొనుగోళ్ల ద్వారా సంక్రమించినవే. మొత్తం 19 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ గ్రూప్‌ కలిగి ఉంది.

ఓడరేవులు, రవాణా: 24% మార్కెట్‌ వాటాతో వాణిజ్య ఓడరేవుల కార్యకలపాలపరంగా దేశంలోనే దిగ్గజ సంస్థగా అదానీ గ్రూపు ఉంది. ఓడరేవు ప్రాంతాలున్న ఏడు రాష్ట్రాల్లో అదానీ గ్రూపు కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అబాట్‌ సహా దేశీయంగా గంగవరం, ధమ్ర, కృష్ణపట్నం, దిఘి లాంటి ఓడరేవులతో పాటు రవాణా సంస్థ ఓషన్‌ స్పార్కిల్‌ను ఇటీవలి కొన్నేళ్లలో అదానీ గ్రూపు కొనుగోలు చేసింది.