Begin typing your search above and press return to search.

పోలవరం మరో శతాబ్దమే...!

By:  Tupaki Desk   |   2 Aug 2021 2:41 PM GMT
పోలవరం మరో శతాబ్దమే...!
X
మరో ఇరవై ఏళ్లల్లో పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదనకు శతాబ్ద కాలం పూర్తి అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మించాలని 1940 ప్రాంతంలో తొలిసారి ప్రతిపాదించారు. అది ఎన్నో ఆటంకాలు దాటుకుని ఈనాటి షేప్ కి వచ్చింది. ఇపుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతోంది అనుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అడ్డుపుల్లలు వేస్తోంది. పోలవరానికి మొత్తం ఏడేళ్ళ కాలంలో కేవలం రు. 11 వేల కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. సవరించిన అంచనాలతో పోలవరం పూర్తి కావాలి అంటే కచ్చితంగా రు. 55 వేల కోట్ల పై చిలుకు అవుతుంది. ఇపుడు సడెన్ గా కేంద్రం మేము ఆ నిధులు ఇవ్వమని అంటోంది. అసరుకే ఎసరు పెట్టేలా మాట్లాడుతోంది. ఏపీ మీద రాజకీయ ఆశలు వదిలేసుకున్న బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోంది అంటున్నారు.

ఒక విధంగా ఇది తీరని అన్యాయమే. కానీ బీజేపీ మాత్రం రాజకీయంగానే ఈ అంశాన్ని చూసుకుంటోంది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఏపీకి ఇన్ని వేల కోట్లు ఎందుకు కుమ్మరించాలి అన్నదే కమలనాధుల బాధ. ఏదో విధంగా పోలవరం ప్రాజెక్ట్ భారాన్ని తప్పించుకోవడానికి నానా రకాలైన ఎత్తులను వేస్తోంది. అందులో భాగమే తాజాగా పార్లమెంట్ వేదికగా బీజేపీ మంత్రి షెకావత్ కుండబద్ధలు కొట్టిన తీరు అంటున్నారు. సవరించిన డీపీఆర్ అనుమతుల కోసం తమ దగ్గర వీపీ పెండింగ్‌లో లేవని కేంద్రం చెప్పింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ ఈ రకంగా చెప్పడం చూస్తే పోలవరం ఇక పూర్తి అయినట్లే అన్న డౌట్లు వస్తే తప్పు కాదేమో..!

2011-19లోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని కేంద్రం పేర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సవరించిన డీపీఆర్‌ను సమర్పించలేదని కేంద్రం తెలిపింది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 54 వేల కోట్లు రూపాయలు ఆమోదించాలని, ఇటీవల కేంద్రమంత్రిని కలిసి వైసీపీ ఎంపీలు కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించామని, ఆర్థికశాఖకు పంపుతామని కేంద్రమంత్రి తెలిపారని ఎంపీలు మీడియా సమవేశంలో పేర్కొన్నారు. అయితే ఈ రోజు కేంద్రం సమాధానం చూస్తే డీపీఆర్ పెండింగ్‌లో లేదని, పెరిగిన అంచానాలను 2011-19లోనే ఆమోదించామని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. ఇలా మొత్తం ప్లేట్ ఫిరాయించడం ద్వారా ఏపీకి కేంద్రం గట్టి ఝలక్ ఇచ్చేసింది.

కేంద్రం చెప్పిన మాటలను బట్టి చూస్తూంటే 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, ఆ తర్వాత పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నదే మాటగా ఉందని అంటున్నారు. తద్వారా పోలవరం సాగు నీటి ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు గానీ, సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు గా నీ కేంద్రం బాధ్యత వహించదని పరోక్షంగా తేల్చి చెప్పింది. దీనిని బట్టి చూస్తే ఈ జన్మకు పోలవరం పూర్తి అయ్యే చాన్సులు అసలు లేవని అర్ధమవుతోంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఇలా అడ్డం తిరగడం రాజకీయంగా వైసీపీకి కూడా అతి పెద్ద దెబ్బగా చూడాలి మరి. తన మనసులోని మాటను కేంద్రం బయటపెట్టేసింది కాబట్టి ఇక ఇప్పట్లో పోలవరం పూర్తి కాదు అని రాసేసుకోవచ్చేమో..!