Begin typing your search above and press return to search.

ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం.. ప్లాస్మా థెరపీ తొలగింపు !

By:  Tupaki Desk   |   18 May 2021 4:30 AM GMT
ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం.. ప్లాస్మా థెరపీ తొలగింపు !
X
ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌) దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వీరవిహారం చేస్తోన్న సమయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా థెరపీని కరోనా ప్రోటోకాల్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్యారోగ్యశాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇకపై కరోనా చికిత్సలో వినియోగించే ప్లాస్మా థెరపీ ఇక ఆగిపోనుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కొద్ది రోజుల ద్వారా ప్లాస్మా దానం చేస్తుండగా , కరోనా వైరస్ సోకి , పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ఆ ప్లాస్మా ఇచ్చేవారు. తద్వారా రోగి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని పలువురు వైద్యులు పేర్కొన్నారు.

అయితే, ప్మాస్మా థెరపీ వల్ల మరణాలను అడ్డుకోలేమని, పెద్ద ఉపయోగం లేదని ఐసీఎంఆర్ గతంలోనే వెల్లడించింది. ఇప్పుడు కరోనా చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఒక వేరియంట్‌ వైరస్‌ సోకిన బాధితులకు మరో వేరియంట్‌ కరోనా సోకిన బాధితుల ప్లాస్మా ఇవ్వడంతో కొత్త మ్యుటేషన్లు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నా, విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స చేస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం పలువురు శాస్త్రజ్ఞులు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్‌ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు బ్రిటన్‌ లో జరిగిన ఒక అధ్యయనంలో కూడా ప్లాస్మా చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదని తేలింది. శ్వాసం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే స్వల్ప లక్షణాలుగా భావించాలని సూచించింది. అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందించాలని చెప్పింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 90 – 93 మధ్యన ఉన్నా.. రెస్పిరేటరీ రేటు నిమిషానికి 24 కన్నా ఎక్కువగా ఉన్నా, మధ్యస్థ స్థాయిగా భావించాలని, ఇలాంటి రోగులను ఆస్పత్రిల్లోని వార్డులో చేర్పించి చికిత్స ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనితో ఇకపై కరోనా రోగుల చికిత్సలో ప్మాస్మా థెరపీని ఉపయోగించడం జరగదు.