Begin typing your search above and press return to search.

పందులకి కుస్తీ పందెం .. కుక్కలకి పరుగు పందెం ... ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   6 March 2021 3:30 PM GMT
పందులకి కుస్తీ పందెం .. కుక్కలకి పరుగు పందెం ... ఎక్కడంటే ?
X
సాధరణంగా ఎక్కడైనా తిరునాళ్లు , బ్రహ్మోత్సవాలు చేస్తున్న సమయంలో అక్కడ ఎద్దులు, పొట్టేళ్ల పోటీలు వంటివి నిర్వహించడం మనం చూసే ఉంటాం. కానీ , అక్కడ మాత్రం శునకాల పరుగు, వరాహాల కుస్తీ పందేలు జరుపుతారు. సంక్రాంతికి ఏపీలో కోళ్ల పందాల మాదిరిగా ఇక్కడ పందుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తుంటారు. ఓన్లీ పందులే కాదు కుక్కలకు కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పందుల పోటీలు ఉత్తిత్తినే కాదు. భారీ ఫ్రైజులు కూడా ఉన్నాయి.

ఇంతకీ శునకాల పరుగు, వరాహాల కుస్తీ పోటీలు జరిగేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా .. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో. ఇక్కడ 1960 నుంచి ప్రతీ యేడాది శ్రీతిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 1న ప్రారంభమైన ఉత్సవాలు..11వ తేదీ వరకు నిర్వహిస్తారు. అయితే… ఇక్కడ ప్రతీ యేడాది జరిగే పెంపుడు జంతువుల ప్రద్శన పోటీలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా పందుల బల ప్రదర్శన పోటీలు ఇక్కడ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పందులు, కుక్కలను తీసుకుని వస్తున్నారు. శుక్రవారం అయిదు జతల పందులకు కుస్తీ పోటీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన 14 కుక్కలకు పరుగు పందేలు నిర్వహించారు. ఈ పోటీలు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మొదటి బహుమతి కర్ణాటక రాష్ట్రం రాయిచూరు జిల్లా కండ్లూరుకు చెందిన కుక్క గౌరీష్‌కు చెందిన రేంజర్‌ కైవసం చేసుకున్నది. రాయిచూర్‌ జిల్లా హజ్‌కల్‌ గ్రామానికి చెందిన తిమ్మప్పనాయక్‌కు చెందిన రాణి రెండో బహుమతి గెలుచుకుంది. మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన మహేష్‌ కుక్క రాఖీ మూడో బహుమతి దక్కించుకుంది. రాయిచూర్‌ జిల్లా గౌరీష్‌కు చెందిన రీటా నాలుగో స్థానంలో నిలిచింది. వీటి యజమానులకు నిర్వాహకులు మల్లికార్జున్‌రెడ్డి, వాగుగడ్డ విష్ణు, అశోక్‌, బహుమతులు అందించారు. అలాగే తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకలకు చెందిన పందుల పోటీలు కూడా జరిగాయి. మరి ఈ పందులను డైరెక్ట్‌గా బరిలో దింపరు. వాటికి ఇవ్వాల్సిన ట్రైనింగ్, ఫిట్నెస్‌ వాటికి ఇస్తారు. పందులకు రోజూ రాగులు, ఉలువలు, జొన్నలు వంటి బలమైన ఆహారాన్ని ఇస్తారు. డైలీ వాకింగ్‌ కూడా చేయిస్తారు. ఆహారం కోసం ఒక్కో పందిపై రోజుకు రూ. 500 ఖర్చు చేస్తామని పందుల యజమానులు చెప్తున్నారు.