Begin typing your search above and press return to search.

పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే పెట్రోల్‌ ధరలు అధికం.. ఎంతంటే!

By:  Tupaki Desk   |   18 May 2022 2:30 PM GMT
పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే పెట్రోల్‌ ధరలు అధికం.. ఎంతంటే!
X
భారత్‌లో గత కొంతకాలంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు చుక్కలను తాకుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎప్పుడో వంద రూపాయలను దాటేశాయి. ప్రస్తుతం ఏపీలో లీటర్‌ పెట్రోలు రూ.122, డీజిల్‌ రూ.104గా ఉంది. ఇటీవల వరకు ప్రతిరోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు 80 పైసలు, 85 పైసలు చొప్పున చమురు ధరలు పెంచాయి. ఇలా వరుసగా ఐదు రోజులపాటు పెట్రోలు రేట్లు పెరిగాయి.

ఈ నేపథ్యంలోనే పొరుగు దేశాలు.. చైనా, పాకిస్థాన్, శ్రీలంకలతో పోలిస్తే భారత్‌లోనే పెట్రోలు ధరలు అధికమని ఓ పరిశోధన తేల్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం.. భారత్‌తో పోలిస్తే చైనా (లీటరు పెట్రోలు 1.21 డాలర్లు), పాకిస్థాన్‌ (లీటర్‌ 77 సెంట్లు), బంగ్లాదేశ్‌ (లీటరు 1.05 డాలర్లు), నేపాల్, శ్రీలంక (లీటర్‌ 77 సెంట్లు), బ్రెజిల్, జపాన్, రష్యా, అమెరికాల్లోనే పెట్రోలు ధరలు తక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. అలాగే హాంగ్‌కాంగ్, జర్మనీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లతో పోల్చితే భారత్‌లో పెట్రోలు ధరలు తక్కువ అని పేర్కొంది.

మే 9 నాటికి మొత్తం 106 దేశాల్లో ఇంధన ధరలను పరిగణనలోకి తీసుకుని బీవోబీ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న దేశాల్లో 42వ స్థానంలో నిలిచింది. మొత్తం 106 దేశాల్లో 50 దేశాల్లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.

ఇండియాలో మే 9 నాటికి లీటర్‌ పెట్రోలు ధర 1.35 డాలర్లుగా ఉందని వెల్లడించింది. భారతదేశంలో ఇంధన ధరలు ఆస్ట్రేలియా, టర్కీ, దక్షిణ కొరియాలతో సమానంగా ఉన్నాయి. కాగా హాంగ్‌కాంగ్, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, నార్వే దేశాల్లో లీటరు రెండు డాలర్ల కంటే ఎక్కువ ఉంది.

పెరుగుతున్న ఇంధన ధరలను అదుపులో ఉంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై విధించే పన్నులను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని నివేదిక వెల్లడించింది. మనదేశం ప్రధానంగా రష్యా, గల్ఫ్‌ కంట్రీస్‌ (సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, యూఏఈ తదితర దేశాల) నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో చమురు సంస్థలు ఇంధన ధరలను సవరిస్తున్నాయి. దీంతో సామాన్యుడి జేబు గుల్ల అవుతోందని బీవోబీ నివేదిక పేర్కొంది.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా భారత్‌ ఉంది. చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లోనూ భారత్‌ మూడో స్థానంలో ఉంది.