Begin typing your search above and press return to search.

తాజాగా రూపాయే అయినా.. ఇప్పటికి అన్నిసార్లు పెంచేశారు

By:  Tupaki Desk   |   19 Sep 2020 6:45 AM GMT
తాజాగా రూపాయే అయినా.. ఇప్పటికి అన్నిసార్లు పెంచేశారు
X
రెండు తెలుగు రాష్ట్ట్రాలు ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఓవైపు భారీగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాల్సి రావటం.. మరోవైపు కరోనా నేపథ్యంలో ఆదాయం భారీగా పడిపోయిన నేపథ్యంలో.. ప్రజలపై భారం వేయాల్సిన అనివార్యత నెలకొంది. అంతకంతకూ పెరిగిపోతున్న రెవెన్యూ లోటును ఒక కొలిక్కి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన జగన్ ప్రభుత్వం.. తాజాగా లీటరు పెట్రోల్ డీజిల్ మీద రూపాయి చొప్పున భారం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

లీటరుకు రూపాయి పెద్ద మొత్తంగా కొందరికి కనిపించకున్నా.. లోతుల్లోకి వెళ్లి చూసినప్పుడు దీని ప్రభావం ఎంతన్న విషయం అర్థమవుతుంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటం కనిపిస్తుంది. కొన్నిసార్లు పన్ను రేటు పెంచటం.. మరికొన్ని సందర్భాల్లో లీటరుకు రూపాయి చొప్పున పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వేసిన రూపాయి వడ్డనతో ఏడాదికి ప్రజల మీద పడే భారం అక్షరాల రూ.600 కోట్లుగా చెబుతుననారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పలు సందర్భాల్లో పెట్రోల్.. డీజిల్ ధరల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పెంచిన పెంపును లెక్కేస్తే లీటరుకు రూ.3 చొప్పున పెరిగిందని చెప్పాలి. జగన్ సర్కారు పవర్ లోకి వచ్చే ముందు వరకు పెట్రోల్ మీద రాష్ట్రంలో 31 శాతం పన్ను.. డీజిల్ మీద 22.25 శాతం పన్ను ఉండేది. వీటికి అదనంగా లీటరుకు రూ.2చొప్పున ఫిక్సెడ్ ఛార్జీని కలిపి వసూలు చేయాలని నిర్ణయించారు. కొన్నాళ్లకు ఫిక్సెడ్ చార్జీని తొలగించారు. కానీ.. ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపశమనం కలుగలేదు.

కారణం.. ఫిక్సెడ్ ఛార్జీ స్థానంలో పెట్రోల్ మీద 35.2 శాతం.. డీజిల్ మీద 27 శాతం పన్ను పోటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత పెంచిన పన్ను శాతాన్ని తగ్గించి.. ఫిక్సెడ్ ఛార్జీల్ని వసూలు చేయటం షురూ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పన్ను శాతాన్ని అలానే ఉంచేసి ఫిక్సెడ్ ఛార్జీని పెట్రోల్ మీద ఉన్న రూ.2 కాస్తా రూ.2.76కు.. డీజిల్ మీద ఉన్న రూ.2 ను రూ.3.07కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఫిక్సెడ్ చార్జీలకు పెట్రోల్.. డీజిల్ లీటరుకు రూపాయి చొప్పున మరోసారి బాదేశారు. దీంతో.. లీటరకు రూ.4 చొప్పున అదనంగా పెరిగినట్లైంది. ఏపీకి సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ.. కర్ణాటక.. తమిళనాడు.. ఒడిశాలతో పోలిస్తే.. రాష్ట్రంలోనే పెట్రోల్.. డీజిల్ ఛార్జీలు అధికంగా ఉండటం గమనార్హం.