Begin typing your search above and press return to search.

మూడు రాజధానులపై కుండబద్ధలు... ?

By:  Tupaki Desk   |   24 Nov 2021 7:39 AM GMT
మూడు రాజధానులపై కుండబద్ధలు... ?
X
ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ ఏదీ అంటే మూడు రాజధానుల వ్యవహారం అనే చెప్పాలి. రీసెంట్ గా మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. దాంతో ఎన్నో అపోహలు, అనుమానాలు అందరిలో ఏర్పడ్డాయి. ఇక్కడితో మూడు రాజధానుల కధ ముగిసింది అని కూడా భావించారు. జగన్ అయితే అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదని, మంచి బిల్లుతో సమగ్రమైన విధానంతో మళ్లీ సభ ముందుకు వస్తామని ప్రకటించారు. అయితే జగన్ అలా చెప్పినా కూడా ఎవరికీ నమ్మకం అయితే కలగడంలేదు. ఇక ఉన్నది ఒక్కటే రాజధాని అని అది అమరావతి మాత్రమేనని అంతా అంటున్నారు. జగన్ ఏ కారణం చేతనో మూడు మూడ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారని అంటున్నారు.

అయితే దీని మీద ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ మంత్రి పేర్ని నాని పక్కా క్లారిటీ ఇచ్చేశారు. మూడు నుంచి మేము ఎక్కడా వెనక్కిపోలేదని చెప్పారు. మూడు రాజధానులు ఉంటాయి. అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖలో పాలనారాజధాని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని కూడా ఆయన అంటున్నారు. ప్రస్తుత చట్టాన్ని రద్దు చేశామని ఇంకా విస్తృతమైన ప్రజాహితమైన చట్టాన్ని చేస్తామని చెప్పారు.

కొత్త బిల్లుల్లో మరిన్ని యాడింగ్స్ కూడా ఉంటాయని ఆయన అంటున్నారు. దీంతో ఇంకా అభివృద్ధికి బాటలు వేస్తామని కూడా నాని అన్నారు. ఇక చంద్రబాబు మీడియా ఎదుట‌ ఏడుపు అనంతరం సానుభూతి కోసం చేస్తున్న రాజకీయాలకు విరుగుడుగా మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేశామనడం సరికాదని అన్నారు. జగన్ కి ఇలాంటి ఎత్తుగడలు అవసరం లేదని ఆయన అన్నారు. తాము ఈ విషయంలో ప్రజలకు బాధ్యులుగా మాత్రమే పనిచేస్తున్నామని చెప్పారు.

బాబు కుటుంబాన్ని ఏదో అన్నామంటూ బాలయ్య తమకు వార్నింగ్ ఇవ్వడాన్ని సీరియస్ గా తీసుకోవడంలేదని అన్నారు. బాలయ్య ముందు అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యల మీద మాట్లాడాలని, హిందూపురానికి ఎమ్మెల్యేగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలని పేర్ని నాని సెటైర్లు వేశారు. శాసనమండలి రద్దు వద్దు అనుకొవడం వెనక కూడా ప్రజా ప్రయోజనాలే ఉన్నాయని నాని చెప్పారు. రాష్ట్రంలో తమకు ఎవరూ పోటీ కాదని, తాము ప్రజలలో ఉన్నామని, వారి అండతోనే తాము ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నామని నాని గుర్తు చేశారు. మొత్తానికి మూడు రాజధానుల విషయంలో మాత్రం క్లారిటీ అయితే వైసీపీ మంత్రి ఇచ్చేశారు అనుకోవాలి.