Begin typing your search above and press return to search.

పేర్ని నానికి సీఎంఓ నుంచి అక్షింత‌లు ప‌డ్డాయా?

By:  Tupaki Desk   |   11 Feb 2022 5:03 PM GMT
పేర్ని నానికి సీఎంఓ నుంచి అక్షింత‌లు ప‌డ్డాయా?
X
ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల ఖ‌రారు, సినీ రంగానికి చెందిన వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అంశం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. తెలుగు సినిమా ప్రముఖులు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయి స‌మ‌స్య‌ల‌ను ఓ కొలిక్కి తెచ్చారు అనుకున్న స‌మ‌యంలో సినీన‌టుడు మోహన్ బాబు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఇంటికి ఏపీ మంత్రి పేర్నినాని వెళ్లి స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఈ స‌మావేశం విష‌యంలో నానీకి సీఎంఓ నుంచి అక్షింత‌లు ప‌డ్డాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ, భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో ఐ అండ్‌ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సైతం ఉన్నారు. ఈ మీటింగ్ అనంత‌రం సీఎంతో స‌మావేశం సక్సెస్ అని, త్వ‌ర‌లోనే శుభ‌వార్త వింటార‌ని వారు ప్రకటించారు.

అయితే, ఆ మ‌రుస‌టి రోజే మంత్రి పేర్నినాని హైద‌రాబాద్‌కు వ‌చ్చి మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కార‌ణంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ అని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. పేర్ని నానితో భేటీ అనంత‌రం ‘ఈ రోజు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. టిక్కెట్ ధరలపై మీ చొరవకు ధన్యవాదాలు. పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వ ప్లాన్ లపై మాకు అప్ డేట్ చేసినందుకు ధన్యావాదాలు. టీఎఫ్ఐ ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.

సీఎం జగన్ తో చిరంజీవి నాయ‌క‌త్వంలో వెళ్లిన బృందం స‌మావేశంలో జ‌రిగిన‌ విశేషాలను మోహన్ బాబుతో చర్చించినట్లుగా ఈ ట్వీట్ ప్ర‌కారం తెలుస్తోంది. మోహన్ బాబు ఇంట్లో దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో సీఎంతో భేటీలో చర్చించిన పలు అంశాలను కూడా వివరించినట్లుగా సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అయితే కొద్దిసేప‌టికే మంచు విష్ణు ఈ ట్వీట్ ఎడిట్‌ చేశారు. దీంతో సీఎంతో సినీ పెద్దల మీటింగ్ విష‌యాల‌ను స్వ‌యంగా మంత్రి మోహ‌న్‌బాబు, మంచు విష్ణుకు తెలియ‌జేయ‌డం ఏంటి? ఈ మేర‌కు చేసిన ట్వీట్ ఎడిట్ చేయ‌డం ఏంట‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో సీఎంఓ నుంచి మంత్రి పేర్ని నానికి అక్షింత‌లు ప‌డ్డాయ‌ని కూడా కొంద‌రు ప్ర‌చారంలో పెట్టారు. కాగా, త‌న‌ను మంచు మోహ‌న్‌బాబు, మంచు విష్ణు కాఫీకి ఆహ్వానిస్తే వెళ్లాన‌ని మంత్రి నాని క్లారిటీ ఇచ్చారు.