Begin typing your search above and press return to search.

డిగ్గీ రాజా నోరు జారారు.... రేపిస్ట్ లు కాషాయధారులట

By:  Tupaki Desk   |   17 Sep 2019 4:25 PM GMT
డిగ్గీ రాజా నోరు జారారు.... రేపిస్ట్ లు కాషాయధారులట
X
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఈ మధ్య తన నోటికి బాగానే పనిచెబుతున్నట్టున్నారు. ఆ పని చెప్పడం కూడా వివాదాలు సృష్టించే దిశగానే సాగుతున్న డిగ్గీ రాజా... వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇప్పటికే పలుమార్లు డిగ్గీ రాజా టంగ్ స్లిప్ కాగా... ఇప్పుడు మరోమారు ఆయన నోరు జారారు. రేపిస్ట్ లను కాషాయధారులుగా అభివర్ణించిన డిగ్గీరాజా పెను కలకలమే రేపారని చెప్పక తప్పదు. రేపిస్ట్ లను నేరుగా బీజేపీ శ్రేణులుగా పేర్కొనపోయినా... రేప్ చేసేవాళ్లంతా కాషాయ వస్త్రాలే ధరిస్తున్నారని, బాధితులను ఆలయాల్లోక తీసుకెళ్లి మరీ అఘాయిత్యాలు చేఃస్తున్నారని, ఆ తర్వాత మకిలి అంటిన ఆలయాలను శుభ్రం చేసేందుకు ఏదో పౌడర్ చల్లి వెళ్లిపోతున్నారని కూడి డిగ్గీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు పెను కలకలంగానే మారాయని చెప్పక తప్పదు.

మంగళవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో సంత్ సంగమ్ అనే ఓ ఆధ్యాత్మిక సంస్థ ‘ఆద్యాత్మిక వైభగ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం కమల నాథ్ తో పాటు డిగ్గీ రాజా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకందుకున్న వెంటనే డిగ్గీరాజా... దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న అత్యాచారాలపై మాట్లాడటం మొదలెట్టారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న వారు కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారని దిగ్విజయ్ తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాషాయ వస్త్రాలు ధరించిన వారే లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా ఈ అఘాయిత్యాలకు వారు ఆలయాలనే వేదికగా చేసుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వారిని దేవుడు కూడా క్షమించబోడని కూడా దిగ్విజయ్ శాపనార్థాలు పెట్టారు.

అక్కడితో ఆగని డిగ్గీరాజా.. సనాతన ధర్మాలను సంపూర్ణంగా మార్చివేస్తున్నారని కూడా బీజేపీపై నిందలేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం జై శ్రీరాం నినాదాన్ని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవానికి జై శ్రీరాం నినాదం... జై సియా రామ్ అని, అయితే దానిని బీజేపీ నేతలు జై శ్రీరాంగా మార్చేశారని ఆయన విరుచుకుపడ్డారు. మొత్తంగా బీజేపీ నేతలను టార్గెట్ చేసుకున్న డిగ్గీరాజా... రేపిస్టులు కాషాయ వస్త్రాల్లోనూ దారుణాలకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మరోమారు పొలిటికల్ హీట్ ను పెంచేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన మధ్యప్రదేశ్ సీఎం కమల నాథ్ సమక్షంలోనే చేయడం గమనార్హం. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.