Begin typing your search above and press return to search.

వినియోగదారులను మోసం చేస్తే నగల వ్యాపారులకు విధించే శిక్షలు ఇవే..!!!

By:  Tupaki Desk   |   24 Nov 2021 11:30 PM GMT
వినియోగదారులను మోసం చేస్తే నగల వ్యాపారులకు విధించే శిక్షలు ఇవే..!!!
X
బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలతో పోలిస్తే భారతదేశం ఓ అడుగు ముందే ఉంటుంది. మనదేశంలో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉండటమే దీనికి కారణం. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయం వచ్చిందంటే నగల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి.

దీనికి తోడు అక్షయ తృతీయ వంటి ప్రత్యేక దినాల్లో బంగారం కొనుగోలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి. బంగారాన్ని కేవలం నగలు, అలంకరణగా మాత్రమే భావించకుండా ఆస్తిగా భావించడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే బంగారం కొనుగోళ్లలో మోసాలు, అవకతవకలు కూడా ఎక్కువే జరుగుతాయి. అయితే గోల్డ్ షాపు వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి...!

బంగారం కొంటే ఎన్నటికీ చెడిపోదని... చేతిలో రూపాయి లేకున్నా... అత్యవసరం ఉంటే తాకట్టు అయినా పెట్టుకోవచ్చని చాలామంది అనుకుంటారు. ఇందుకే పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ విధంగా కొనుగోలు చేసిన ఆభరణాలు నకిలీవి అని తేలితే చాలా మందికి గుండె గుబేలుమంటుంది.

ఇటువంటి వారికి అండగా నిలబడి అందుకే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చింది. కొనుగోలు చేసినప్పుడు వాటిలో మోసపోయినట్లు వినియోగదారులు భావిస్తే వారు చట్టం ద్వారా న్యాయం పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన బంగారు ఆభరణాలపై వినియోగదారుల రక్షణ చట్టం అండగా నిలుస్తుంది. సాధారణంగా నగల వ్యాపారానికి సంబంధించి జరిగే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 18 క్యారెట్ బంగారాన్ని ఎక్కువ క్యారెట్లు గా చూపించే అమ్ముతుంటారు కొందరు వ్యాపారులు.

దీని ద్వారా వినియోగదారుడు తీవ్రంగా మోసపోతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హాల్ మార్క్ ఉన్న నగలను కొనుగోలు చేయడంలో వినియోగదారుడు ఒకింత తికమకకు గురవుతున్నాడు.

దీన్ని అదునుగా చూసుకొని బంగారం వ్యాపారులు కస్టమర్లను మోసం చేస్తుంటారు. అయితే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టే దిశగా బంగారు ఆభరణాలపై వినియోగదారుల రక్షణ చట్టం బాధితులకు అండగా నిలుస్తుంది. దీని ద్వారా నగల వ్యాపారి వినియోగదారుని మోసం చేసినట్లు తేలితే కఠిన శిక్షలను ఎదుర్కోవలసి వస్తుంది.

నగల వ్యాపారి కస్టమర్లను ఏ రూపంలో అయినా మోసం చేసినట్లు విచారణలో తేలితే ఈ చట్టం ప్రకారం రూ.లక్ష వరకూ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా కేసు తీవ్రతను బట్టి వ్యాపారిని జైలు పాలు చేసే అవకాశం కూడా ఉంటుందని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి.

వినియోగదారులకు సంబంధించిన హక్కుల పరిరక్షణలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాకుండా దీని ద్వారా నగల లావాదేవీలు చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

వినియోగదారులకు మేలిమి బంగారు నగలను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి మరో నిర్ణయమే హాల్ మార్క్ ను తప్పనిసరి చేయడం బంగారు నగలను కొనుగోలు చేసేటప్పుడు ఈ హాల్ మార్క్ ను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చాలా జాగ్రత్తగా గోల్డ్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

ఈ విధంగా హాల్ మార్క్ నగలను కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా అవి మంచి ధరకు అమ్ముడు అవుతాయని చెపుతున్నారు. దీనిలో భాగంగా కేంద్రం హాల్ మార్క్ ముద్రించే కేంద్రాల సంఖ్యను మరింతగా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా పలు నివేదికల ప్రకారం సుమారు 900 పైగా హాల్ మార్క్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. సో చూశారుగా.. బంగారం కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా కొనుగోలు చేసుకోవచ్చు.