Begin typing your search above and press return to search.

జనసేన మీటింగ్ కు వచ్చింది అంతమందేనా!

By:  Tupaki Desk   |   22 April 2019 8:27 AM GMT
జనసేన మీటింగ్ కు వచ్చింది అంతమందేనా!
X
ఇంతలోనే ఎంత తేడా.. మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ ఎక్కడికైనా వస్తున్నారంటే..అక్కడ వేల సంఖ్యలో అభిమానులు గుమిగూడే వారు. పవన్ రోడ్ షో చేస్తున్నారంటే - ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే.. యువతరం ఆయన వెంట పడేది. వీరాభిమానులు అక్కడ కల్లోలం రేపే వాళ్లు. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా సాధ్యం అయ్యేది కాదు. అనేక చోట్ల అవాంచిత సంఘటనలు జరిగేవి.

అలా ఉండేది పవన్ కల్యాణ్ క్రేజ్. అయితే పోలింగ్ పూర్తి అయ్యాకా.. జనసేన సమీక్ష సమావేశం జరిగిన చోట అభిమానుల కోలాహలం ఏమీ కనిపించకపోవడం ఆసక్తిదాయకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ సాగిన తీరుపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించగా..ఆ కార్యక్రమానికి పట్టుమని వందమంది కూడా హాజరు కాలేదని తెలుస్తోంది!

జనసేన పార్టీ తరఫున చాలా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు అయ్యాయి. మిత్రపక్షాల వాళ్లు ఉన్నారు. ఆ పార్టీకి అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలు ఉన్నారు. అయితే సమీక్ష సమావేశానికి వారిలో చాలా మంది మొహం చాటేశారు. ఇక వీరాభిమానుల తాకిడి కూడా లేదు. పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల ప్రక్రియ మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపించలేదు.

'సీట్లు కాదు.. ఓట్లే ముఖ్యం ..' అని పవన్ కొత్త థియరీ చెప్పుకొచ్చారు. ఓట్లు వస్తే సీట్లు కూడా వస్తాయని పవన్ కల్యాణ్ మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఇక ఇప్పటికే జనసేనకు కొన్ని రాజీనామాలు మొదలయ్యాయి. టీవీ చానళ్లలో కూర్చుని మాట్లాడిన వాళ్లు అప్పుడే జనసేనకు తాము దూరం అయినట్టుగా ప్రకటించేసుకున్నారు. ఇదీ కథ. పోలింగ్ పూర్తి అయితేనే పరిస్థితి ఇలా ఉంది. ఫలితాలు వచ్చాకా ఇంకెలా ఉంటుందో!