Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో జ‌న‌సేన మీట్‌.. రిజ‌ల్టేంటి?

By:  Tupaki Desk   |   22 Jan 2021 3:50 AM GMT
తిరుప‌తిలో జ‌న‌సేన మీట్‌.. రిజ‌ల్టేంటి?
X
తిరుప‌తి వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ స‌మావేశం నిర్వ‌హించారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. తిరుపతి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే.. ఉప ఎన్నిక‌లో అభ్యర్థి ఎంపిక అంశంపై ఈ సమావేశంలో నిర్ణ‌యం తీసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. ఇక‌, రాష్ట్రంలో ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల నేప‌థ్యంలో పార్టీ త‌ర‌ఫున ఆశించిన స్థాయిలో ఉద్య‌మం సాగ‌లేదనేది కొంద‌రి అభిప్రాయం. ఈ నేప‌థ్యంలో దీనిపైనా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం.. రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల క‌మిష‌నర్ నిమ్మ‌గ‌డ్డ షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం, దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. తాజా ప‌రిణామాల విష‌యంపై జ‌న‌సేనాని చ‌ర్చించి న‌ట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు.. ఎలాంటి రిజ‌ల్ట్ అవ‌స‌రం.. ఎలా ప‌నిచేయాలి? అనే అంశాల‌పై పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మ‌నోహ‌ర్ ఇప్ప‌టికే సిద్ధం చేసిన విష‌యం తెలిసిందే. నిజానికి బీజేపీతో పొత్తు ఉన్న నేప‌థ్యంలో తిరుప‌తిఉప ఎన్నిక‌లో ఈ టికెట్‌ను త‌మ‌కు ఇవ్వాల‌న్న‌ ప్ర‌తిపాద‌న‌ను జ‌న‌సేన తెర‌మీదికి తెచ్చింది.

అయితే.. దీనిపై బీజేపీ ఎటూ తేల్చ‌కుండానే.. తిరుప‌తి గెలుపు త‌మ‌దే నంటూ.. సోము వీర్రాజు ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించారు. దీనిపై జ‌న‌సేన నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో తిరుప‌తిలో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? టికెట్ ఇస్తే.. ఎలా.. ఇవ్వ‌క‌పోతే.. ఎలా? అనే విష‌యాల‌పై జ‌న‌సేన అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఇప్పటికే జనసేన తరపున తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి తిరుపతి స‌మావేశంలో ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి దీనిపై అధికారికంగా ఎవ‌రూ స్పందించ‌లేదు. కాగా... పార్టీ కార్య‌క్ర‌మం కోసం హాజ‌రైన ప‌వ‌న్ కు రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. అయితే.. ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమ‌తించ‌లేదు. ఇక‌, స‌మావేశం ప్రారంభంలో ఇటీవల ప్ర‌కాశం జిల్లా కు చెందిన ఎమ్మెల్యే అన్నారాంబాబుతో వివాదం నేప‌థ్యంలో ప్రాణాలు కోల్పోయిన‌.. జననేన కార్య‌కర్త‌.. బండ్ల వెంగయ్య నాయుడు మృతి కి సంతాప సూచ‌కంగా.. ప‌వ‌న్ స‌హా నాయ‌కులు మౌనం పాటించారు.