Begin typing your search above and press return to search.

పీకే స్టేట్ మెంట్..జనానికి బాబును ప్రశ్నించే హక్కు లేదట

By:  Tupaki Desk   |   16 Feb 2020 8:30 PM GMT
పీకే స్టేట్ మెంట్..జనానికి బాబును ప్రశ్నించే హక్కు లేదట
X
జనసేనాని పవన్ కల్యాణ్ నోట సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న స్టేట్ మెంట్లు వచ్చేస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా సాగించిన అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఎంతమాత్రం లేదని పవన్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇందుకు ఆయన ఓ కారణం కూడా చెప్పేశారు. ఎన్నికల్లో రూ.2 వేలో, అంతకంటే ఎక్కువో తీసుకుని ఓట్లేసిన జనానికి... రూ.2 వేల కోట్ల చంద్రబాబు అవినీతిని ప్రశ్నించే హక్కు లేదని పవన్ సూత్రీకరించారు. నేతలను ప్రశ్నించే హక్కు జనానికి లేకుంటే... ఇంకెవరికి ఉందన్న విషయాన్ని పవనే చెప్పాలన్న రీతిలో ఇప్పుడు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో ఆదివారం జరిపిన సమీక్ష సందర్బంగా పవన్ నోట నుంచి ఈ సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ఈ సందర్భంగా పవన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ఎన్నికల్లో తమ ఓటను 2వేలకో అంతకంటే ఎక్కువకో అమ్ముకుంటున్న ప్రజలు అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి అనే పదం పెద్దదనుకుంటే ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయారు అని సరిచేసుకోవచ్చు. ఈ పనిచేయడం ద్వారా ప్రజలు.. నాయకులను ప్రశ్నించే లేదా నాయకులపై తిరుగుబాటు చేయగలిగే నైతిక హక్కును కోల్పోయారు. రూ.2వేలకు ఓటు అమ్ముకునే ప్రజలకు.. రూ.2వేల కోట్లు దోచేసిన చంద్రబాబు పీఏ ను ప్రశ్నించే హక్కు లేనేలేదు. ఈ సమాజం చాలా దారుణంగా విచ్ఛిన్నమైపోయింది. అతి తీనావస్థలోకి దిగజారిపోయింది'' అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పవన్ ఇంకా చాలా విషయాలే మాట్లాడారు గానీ... చంద్రబాబు అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ మాట ద్వారా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పవన్ ఒప్పేసుకున్నారా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు అవినీతికి పాల్పడినా కూడా జనం బాబును ప్రశ్నించజాలరంటూ పవన్ వ్యాఖ్యానించారంటే... బాబు అవినీతికి పవన్ వత్తాసు పలుకుతున్నట్లేనా? అన్న విశ్లేషణలూ సాగుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు అవినీతిపై స్పందించిన పవన్... తనను తానే తన వ్యాఖ్యల ద్వారా ఇబ్బందుల్లోకి నెట్టేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.