Begin typing your search above and press return to search.

పవన్‌కు గుండు.. క్లారిటీ ఇచ్చిన పరిటాల కుమారుడు!

By:  Tupaki Desk   |   2 Dec 2022 8:53 AM GMT
పవన్‌కు గుండు.. క్లారిటీ ఇచ్చిన పరిటాల కుమారుడు!
X
గతంలో ఓ వివాదానికి సంబంధించి పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు అప్పటి అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పవన్‌ కల్యాణ్‌తోపాటు పరిటాల రవి, ఆయన భార్య సునీత కూడా స్పష్టత ఇచ్చారు. ఇదంతా అబద్ధమని ఖండించారు.

కాగా పవన్‌ కల్యాణ్‌ను తక్కువ చేయడానికే కొంతమంది వెబ్‌సైట్స్‌లో ఇలాంటి వార్తలు రాయించి ప్రచారం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇక వైసీపీ మంత్రి ఆర్కే రోజా వంటివారు పవన్‌కు పరిటాల గుండు కొట్టించారని తీవ్ర విమర్శలు చేస్తుంటారు.

తాజాగా ఈ అంశంపై పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్‌ క్లారిటీ ఇచ్చారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పరిటాల శ్రీరామ్‌ స్పష్టత ఇచ్చారు. ఇదంతా పచ్చి అబద్ధమని ఆయన తేల్చిచెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ మంచి నటుడు అని పరిటాల శ్రీరామ్‌ ప్రశంసించారు. ఆయనకు సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉందని కొనియాడారు. ఓ నాయకుడిగా ఎదిగే సమయంలో ఆయనను దెబ్బకొట్టడానికి ఇలాంటి ప్రచారాలను తెరమీదకు తెచ్చారని పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు. నాయకుడిగా ఎదగాలనుకునే వ్యక్తిపైన ఇలాంటి రూమర్లు సర్వసాధారణమని తేల్చిచెప్పారు.

ఇలాంటి ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంటే వాటిపై స్పందించొచ్చు కానీ నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఎలా స్పందిస్తామని పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు. పవన్‌ను తక్కువ చేసి చూపించడానికే ఇలాంటి రూమర్లు సృష్టిస్తున్నారని పరిటాల శ్రీరామ్‌ అసహనం వ్యక్తం చేయడం విశేషం.

పవన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని పరిటాల శ్రీరామ్‌ వెల్లడించారు. అలాంటి వాళ్లు ఎన్ని రూమర్లు సృష్టించినా పవన్‌ అర్థం చేసుకోగలరు అని శ్రీరామ్‌ చెప్పడం విశేషం. తన తండ్రి ఇమేజ్‌ను నెగిటివ్‌ చేయడానికి మాట్లాడే మాటలే తప్ప తన తండ్రి గుండు కొట్టించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీరామ్‌ వివరించారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.