Begin typing your search above and press return to search.

దేశ చట్టాలే ఉన్నతమైనవి .. ట్విట్టర్ పై పార్లమెంట్ కమిటీ ఆగ్రహం !

By:  Tupaki Desk   |   19 Jun 2021 6:30 AM GMT
దేశ చట్టాలే ఉన్నతమైనవి .. ట్విట్టర్ పై  పార్లమెంట్ కమిటీ ఆగ్రహం  !
X
గత కొద్ది రోజులుగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య పలు అంశాలపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థాయీ సంఘం ఎదుట ట్విట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశం సందర్భంగా పార్లమెంట్ స్థాయి సభ్యులు పలు సంచలన వాఖ్యలు చేశారు. దేశ చట్టాలే అత్యంత ఉన్నతమైనవి తప్పా, సంస్థ విధివిధానాలు కాదని పార్లమెంట్ స్థాయీ సంఘం సభ్యులు ట్విట్టర్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. శుక్రవారం ట్విట్టర్ ప్రతినిధులు పార్లమెంట్ స్థాయి సంఘం ఎదుట హాజరై సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా తీసుకుంటున్న చర్యలపై వారు వివరణ ఇచ్చారు. దాదాపు 90 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.

అయితే, వారు తమ సంస్థ విధానాలకు కట్టుబడి ఉంటామని ట్విట్టర్ ప్రతినిధులు చెప్పగా, పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తమ విధానాలు కూడా దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని ట్విట్టర్ సభ్యులు చెప్పగా, పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ట్విట్టర్ సభ్యులు చెప్పిన సమాధానాలపై అన్ని పార్టీల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సూచనలను వీరు పాజిటివ్ గా తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మీరిలాగే వ్యవహరిస్తే మీకు న్యాయపరమైన రక్షణ ఉండదని కేంద్రం హెచ్చరించిన విషయాన్ని పార్లమెంటరీ కమిటీ వీరి దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఇప్పటికీ ట్విటర్ వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ కమిటీ గత వారం దీనికి సమన్లు జారీ చేసిన అంశం గమనార్హం.

ఈ సమావేశంలో బీజేపీ నుంచి నిషికాంత్ దూబే, రాజ్యవర్ధన్ రాథోడ్, తేజస్వీ సూర్య, సంజయ్ సేథ్, జాఫర్ ఇస్లాం. సుభాష్ చంద్ర, ప్రతిపక్షాలకు చెందిన మహువా మెయిత్రా, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. అయితే సమస్యల పరిష్కారం కేంద్రం నిబంధనల ప్రకారం శాశ్వత అధికారి బదులు తాత్కాలిక ప్రాతిపదికన నియమించడంపై సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ఈ విషయంపై సమావేశం అనంతరం ట్విట్టర్ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. తమ సిద్ధాంతాలైన పారదర్శకత, భావస్వేచ్ఛ, ప్రైవసీకి అనుగుణంగా పార్లమెంటరీ కమిటీతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేయడానికి వేదికను కల్పించడంతో పాటు, ప్రైవసీ కల్పించడమే తమకు ప్రభుత్వానికి ఉన్న ఉన్నత లక్ష్యమని తెలిపారు. ఇండియాలో తమ కాంప్లియెన్స్ అధికారులను తప్పనిసరిగా నియమించాలన్న ప్రధాన నిబంధనను ట్విటర్ పెద్దగా పట్టించుకోలేదు. వీరిని తాము నియమించినట్టు పేర్కొన్నా, వీరి వివరాలను సరిగా వెల్లడించలేదని తెలిసింది.