Begin typing your search above and press return to search.

గోదావరిలో మళ్లీ మొదలవుతున్న బోటింగ్ ... ప్రకృతి ప్రేమికులకు ఇక పండుగే !

By:  Tupaki Desk   |   14 April 2021 11:30 PM GMT
గోదావరిలో మళ్లీ మొదలవుతున్న బోటింగ్ ... ప్రకృతి ప్రేమికులకు ఇక పండుగే !
X
సమ్మర్ లో ఎక్కడైనా చల్లగా ఉండే ప్రాంతాలకి వెళ్లాలని ఉత్సాహపడుతుంటారు. బాగా డబ్బున్న వాళ్లైతే ఏ స్విట్జర్లాండో చెక్కేస్తారు. లేదంటే కాశ్మీర్, అదీ లేదంటే ఊటీ కి వెళ్లారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి ప్రజలు వెళ్లే టూర్ ఏదైనా ఉంది అంటే అది పాపికొండల యాత్ర. చల్లటి గోదావరి నదిలో ప్రయాణిస్తూ పాపికొండల అందాలను వీక్షించటానికి పర్యాటకులు రాజమహేంద్రవరం వస్తూ ఉంటారు. పాపికొండల సందర్శనలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కొండలు కోనల వంటి అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవు , తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి పాపికొండలు. పాపికొండల ప్రాంతంలో ఉన్న చెట్లు ఆకులను రాల్చవు. అందుకే 365 రోజులు పచ్చగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాంతం, చాలా ప్రశాంతగా ఉంటుంది. అందంగా రమణీయంగా ఉంటూ ఆహ్లాదం కలిగించే ప్రదేశం పాపికొండలు. రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది.

అయితే , 2019 సెప్టెంబర్‌ 15న తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడం తో పటు ఎన్నో కుటుంబాలలో తీరని విషాదం మిగిల్చింది. ఆ ఘటనతో ప్రభుత్వం గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్‌ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిచింది. కచ్చులూరు మందం వద్ద వరద ఉద్ధృతిని అంచనా వేయకుండా బోటు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన క్రమంలో ప్రమాదానికి గురయ్యింది. బోటులో ఉన్న వారిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిలో అత్యధికులను స్థానిక కచ్చులూరు ప్రాంతానికి చెందిన గిరిజన యువకులు కాపాడారు. సాహసోపేతంగా నదిలో ప్రమాదాన్ని గ్రహించి నీటిలోకి దూకి అనేకమందిని ఒడ్డుకి చేర్చగలిగారు. చివరకు బోటు సరంగు సహా పర్యాటకుల ప్రాణాలు నీటిపాలయ్యాయి. అందులో కొందరి మృతదేహాలు కూడా లభించలేదు. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో గోదావరిలో విహరిస్తూ పాపికొండల అందాలను వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతి లభించటంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

18 నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి వద్ద నుంచి బోటు బయలుదేరనుంది. రాజమహేంద్రవరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దేశమంతా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో గోదావరిలో విహార యాత్రకు అనుమతినివ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా తగ్గిన కాలంలో కూడా డిసెంబర్ నుంచి ఎందుకు బోట్లు నడపడానికి అనుమతినివ్వలేదు. అన్ని చోట్లా టూరిస్టులను అనుమతించి కేవలం పాపికొండల్లోనే ఎందుకు ఆపేశారు. ఇప్పుడు అనేక చోట్ల లాక్‌డౌన్ వార్తలు వస్తుంటే మళ్లీ ఎలా అనుమతిస్తారు. పైగా బోటులో వంద మంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ కలిసే ఉంటారు. కలిసే తింటారు. కాబట్టి భౌతిక దూరం సహా అనేక జాగ్రత్తలకు అవకాశం తక్కువ. అయినప్పటికీ మళ్లీ కరోనా పెరుగుతున్న సమయంలో బోటింగ్ ప్రారంభించడం వెనుక కారణాలు అర్థం కావడం లేదంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో బోటింగ్ విషయంలో పరిశీలన చేసేందుకు అనుగుణంగా నిబంధనలను కట్టుదిట్టం చేశారు. కాకినాడ పోర్ట్ అధికారులకు బోట్ల ప్రామాణికతను పరిశీలించి, అనుమతినిచ్చే అధికారం అప్పగించారు. దాంతో పాటుగా గోదావరి పొడవునా పలు చోట్ల వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. ఇకపై గోదావరి బోటింగ్ పటిష్టంగా ఉంటుందని ఏపీ టూరిజం అధికారులు చెబుతున్నారు.