Begin typing your search above and press return to search.

తాలిబన్లకి బిగ్ షాక్ ఇచ్చిన పాక్ .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   15 Oct 2021 2:30 PM GMT
తాలిబన్లకి బిగ్ షాక్ ఇచ్చిన పాక్ .. ఏమైందంటే ?
X
తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా గురువారం నుండి కాబూల్‌ కు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ లైన్స్ (పీఐఏ) నిలిపివేసింది. టికెట్ల ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో సేవలను నిలిపివేస్తామని తాలిబన్లు ఇటీవల పీఐఏతో పాటు స్థానిక విమానయాన సంస్థ కామ్ ఎయిర్‌ ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పాక్ ఎయిర్‌ లైన్స్ విమానం టికెట్ ధర కాబుల్‌ నుంచి ఇస్లామాబాద్‌కు 2500 డాలర్ల వరకు ఉంటోంది. అంతకు ముందు కేవలం 120- 150 డాలర్ల మధ్యే ఉండేది. అఫ్గనిస్థాన్‌‌ ను తాలిబన్ల అక్రమించుకున్న తర్వాత కాబూల్ నుంచి రెగ్యులర్‌గా విమాన సర్వీసులు నడుపుతున్న ఏకైక అంతర్జాతీయ విమాన సంస్థ పీఐఏ మాత్రమే.

ప్రస్తుతం కాబూల్‌ కు ఛార్టర్డ్‌ విమానాలను పాక్ ఎయిర్‌ లైన్స్ నడుపుతోంది. సర్వీసుల నిలిపివేతపై స్పందించిన పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్.. కాబూల్ ఏవియేషన్ అధికారుల వైఖరి కారణంగా తమ విమానాలు అవాంఛిత జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. పరిస్థితి అనుకూలించే వరకూ ఆ మార్గంలో విమానాలను నడపబోమని ఆయన స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో అఫ్గన్‌ కు విమానాలు నడుపుతున్నాం. బీమా సంస్థలు కాబుల్‌ ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున.. బీమా ప్రీమియం ధరలు భారీగా ఉన్నాయి. ఈ ప్రభావం టికెట్లపై పడుతోంది అని ఖాన్ వివరించారు. మరోవైపు, తాలిబన్లు సైతం చివరి నిమిషంలో ప్రయాణ నిబంధనలు మార్చడం, అనుమతులకు కొర్రీలు పెట్టడం, సిబ్బందిని భయపెట్టే విధంగా ప్రవర్తించడం చేస్తున్నారని ఆరోపించారు.

నిజాయితీగా చెప్పాలంటే సాధారణ విమానాలు పునః ప్రారంభానికి ముందు నిర్వాసితులకు తిరిగి వెళ్లడానికి కొంత మార్గం ఉంటుంది. అత్యుత్తమంగా.. మాది చార్టర్ కార్యకలాపాలు, కాబూల్ నుంచి తమ ప్రజలను బయటకు తీసుకురావాలనుకునే కొంత మంది కస్టమర్ల డిమాండ్ మేరకు పనిచేస్తుంది అని పేర్కొన్నారు. ఈ విషయంపై ‘కామ్‌ ఎయిర్‌’ ఇంకా స్పందించలేదు. భూ మార్గాల్లో దేశం దాటేందుకు ఇబ్బందుల కారణంగా అఫ్గన్‌ లో విమాన ప్రయాణానికి భారీ డిమాండ్ ఏర్పడింది. కాబూల్‌ లోని ప్రధాన పాస్‌ పోర్ట్ కార్యాలయానికి స్థానికులు పోటెత్తుతున్నారు. కాబూల్‌ కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ..ఈ విమానాల అవసరం మాకు లేదు. సరిహద్దులు మూసివేశారు.. ఇప్పుడు విమానాశ్రయం మూసివేస్తే మనమందరం బోనులో ఉన్నట్లే అని పేర్కొన్నారు.