Begin typing your search above and press return to search.

జమిలిపై తొలి అడుగు..అధ్యయనం కోసం కమిటీ

By:  Tupaki Desk   |   19 Jun 2019 5:53 PM GMT
జమిలిపై తొలి అడుగు..అధ్యయనం కోసం కమిటీ
X
ఒకే దేశం- ఒకే ఎన్నిక దిశగా సాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... కీలకమైన తొలి అడుగు వేశారు. లోక్ సభ - అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని, అదే జరిగితే... ఐదేళ్ల పాటు నిర్భయంగా పాలన సాగించే ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా సాగుతాయని - ఇది ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని - ఎన్నికల ఖర్చు కూడా బాగా తగ్గిపోతుందని... అన్నీ అనుకూలాంశాలే ఉన్న జమిలి ఎన్నికల దిశగా సాగుదామని చాలా కాలం నుంచి మోదీ పదే పదే చెబుతున్నారు. అయితే 2019 ఎన్నికలకు సమయం ముంచుకు రావడం - ఆలోగానే ఈ విషయంపై ఓ స్పష్టత రాకపోవడంతో... పాత పద్దతిలోనే ఎన్నికలు జరిగాయి. అయితే వరుసగా రెండో సారి కూడా బంపర్ మెజారిటీతో కేంద్రంలో అదికారం దక్కించుకున్న మోదీ... జమిలిపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రధానిగా రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే జమిలిపై దృష్టి సారించిన మోదీ... నేడు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు ఏపీలో విపక్షం టీడీపీ కూడా దూరంగా ఉండగా... వైసీపీ తరఫున ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ రెండు పార్టీలతో పాటు దేశంలోని 22 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీ నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం... జమిలి ఎన్నికలను ఏ రీతిన నిర్వహిస్తే బాగుంటుంది? అసలు జమిలికి ఉన్న అవకాశాలెన్ని? ప్రతికూలతలు ఎన్ని? జమిలి నిర్వహణను ఏ రీతిన నిర్వహించాలి? అన్న అంశాలపై సమగ్ర అధ్యయనం కోసం ఓ కమిటీని నియమించాలని కేంద్రం తీర్మానించింది.

ఈ నిర్ణయాన్ని భేటీ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. జమిలి ఎన్నికలు అనేది ప్రభుత్వ అజెండా కాదని ప్రకటించిన రాజ్ నాథ్... దేశ అజెండా అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ భేటీకి హాజరైన వైసీపీ - టీఆర్ ఎస్ సహా మెజారిటీ మద్దతు పలికాయి. మజ్లిస్ - సీపీఐ - సీపీఎం పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికలు సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మొత్తంగా జమిలి ఎన్నికలపై మెజారిటీ పార్టీలు మద్దతు పలికితే... కొన్ని పార్టీలు వ్యతిరేకించినా... కేంద్రం మాత్రం ఈ దిశగా అధ్యయనం కోసం కమిటీని వేయాలని నిర్ణయించి ఈ దిశగా తొలి అడుగు వేసిందనే చెప్పాలి.