Begin typing your search above and press return to search.

తిట్టిన వ్యక్తిని కలిసి అభినందించిన మోడీ!

By:  Tupaki Desk   |   22 Oct 2019 9:33 AM GMT
తిట్టిన వ్యక్తిని కలిసి అభినందించిన మోడీ!
X
నోబెల్‌ పురస్కార విజేత అభిజీత్‌ బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభిజీత్‌తో అనేక విషయాలపై చర్చలు జరిపానని మోడీ ట్వీట్‌ చేశారు. మానవ సాధికారతపై అభిజీత్‌ కు ఉన్న అవగాహన స్పష్టంగా వెల్లడైందని మోడీ పేర్కొన్నారు. తమ సమావేశం ఎంతో అద్భుతంగా సాగిందని - అనేక విషయాల గురించి మాట్లాడుకున్నామని మోదీ ట్వీట్ చేశారు.

కాగా అభిజిత్ బెనర్జీ తన తాజా పుస్తకం ‘గుడ్ ఎకనమిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్: బెటర్ ఆన్సర్స్ టు అవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లెమ్స్’ పుస్తకం ప్రమోషన్ కోసం భారత్‌ లో ఉన్నారు. అభిజిత్ ఈ పుస్తకాన్ని తన రెండో భార్య - తనతో పాటు నోబెల్‌ కు ఎంపికైన ఎస్తేర్ డఫ్ లో‌తో కలిసి రాశారు.

కాగా అభిజిత్ నోబెల్ గెలుచుకున్న తరువాత మషాచుషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని విమర్శించారు. మరోవైపు అభిజిత్ ఇండియాలో కాంగ్రెస్ - ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి కొంతవరకు పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించి కనీస ఆదాయ పథకం రూపకర్త కూడా అభిజిత్ బెనర్జీయే. అలాగే దిల్లీలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ఆప్ ప్రభుత్వం అనుసరించిన విధానాలకు మార్గదర్శి కూడా అభిజిత్ బెనర్జీయే.

రాహుల్ - కేజ్రీవాల్‌ లు మోదీకి రాజకీయ ప్రత్యర్థులు. అభిజిత్ కూడా గతంలో - తాజాగా కూడా మోదీ విధానాలను విమర్శించారు. ఈ నేపథ్యంలో మోదీ - అభిజిత్ భేటీ అందరిలో ఆసక్తి రేపింది. అయితే... దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం అవన్నీ పక్కనపెట్టి అభిజిత్ సలహాలు తీసుకునే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తోంది.