Begin typing your search above and press return to search.

కొవిడ్ కాలంలో ఆర్థిక పరిస్థితిపై 'ఆక్స్ ఫామ్' షాకింగ్ నివేదిక

By:  Tupaki Desk   |   18 Jan 2022 5:52 AM GMT
కొవిడ్ కాలంలో ఆర్థిక పరిస్థితిపై ఆక్స్ ఫామ్ షాకింగ్ నివేదిక
X
రెండు సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు అన్నిదేశాల్లోనూ ఈ మహమ్మారి ప్రవేశించి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. రోజూ కూలీ నుంచి బడా వ్యాపార వేత్తల వరకు కరోనా ప్రభావం చూపడంతో అందరి జీవితాలు మారిపోయాయి. అయితే ముఖ్యంగా కరోనా విస్తరణతో ఎవరు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయారు..? ఎవరు లాభ పడ్డారు..? అనే విషయంపై ‘ఆక్స్ ఫామ్’ అనే సంస్థ పలు ఆసక్తి విషయాలను తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభానికి ముందు ప్రపంచ అసమానతలపై ఆక్స్ ఫామ్ తన నివేదికను విడుదల చేస్తుంది. ఈఏడాది త్వరలో ఆ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఆక్స్ ఫామ్ ఈ నివేదికలను బయటపెట్టింది.

ప్రపంచం ప్రతి మూలన కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొందరు ఈ వైరస్ కు తట్టుకొని నిలబడగా మరికొందరు ప్రాణాలు విడిచారు. . పేద, ధనిక అని తేడా లేకుండా అందరూ వైరస్ బారిన పడ్డారు. అయితే ఈ వైరస్ తో కొందరు తీవ్రంగా నష్టపోతుంటే... మరికొందరు మాత్రం రెట్టింపు లాభాలు పొందారు. అంటే పేదవారు మరింత నిరుపేదలవగా.. ధనికులు అపర కుభేరులుగా అవతారమెత్తారని ఆక్స్ ఫామ్ తెలిపింది. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది కొత్తగా నిరుపేదలయ్యారు. కానీ ఇదే సమయంలో రోజుకో కుభేరుడు పుట్టుకొచ్చాడు. ఈ మహమ్మారితో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ అప్పులు పెరగగా..అవి సామాజిక వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది. కానీ 10 మంది సంపన్నుల ఆదాయం మొత్తం 2020 మార్చి నుంచి రెట్టింపు అయింది. 2021 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 21 వేల మంది మరణిస్తే ఇందులో పేదవారే ఎక్కువగా ఉన్నారని ‘ఆక్స్ ఫామ్’ తెలిపింది.

భారత్ లోనూ కొవిడ్ ప్రకంపనలు సృష్టించిందని ఆక్స్ ఫామ్ పేర్కొంది. 2021 సంవత్సరంలో 84 శాతం మంది ఆదాయం పడిపోగా..102 మంది బిలియనీర్ల సంఖ్య 142కు పెరిగిందని తెలిపింది. అయితే 2020-21 బడ్జెట్లో ఆరోగ్య శాఖ కు కేటాయింపులను ప్రభుత్వం తగ్గించింది. అలాగే విద్యారంగం, సామాజిక భద్రత పథకాలకూ కేటాయింపులో 6 శాతానికి తగ్గించింది. కానీ ఇదే సమయంలో 100 మంది అత్యంత సంపన్నుల ఉమ్మడి ఆదాయం ఈ సంవత్సరంలో 57.3 లక్షల కోట్లకు పెరిగింది. మహమ్మారి కాలంలో బిలియనీర్ల సంపద 23.14 లక్షల కోట్ల నుంచి 53.16 లక్షల కోట్లకు పెరిగింది.

అంటే ధనవంతులు మరింత ధనవంతులయ్యారు. అమెరికా, చైనా తరువాత ఇండియాలోనే కుబేరులు ఎక్కువగా ఉన్నారు. ఇక భారత్లోని 100 మంది బిలియనీర్ల సంపద పెరుగుదలలో దాదాపు ఐదో వంతు అదానీదేనని ఆక్స్ ఫామ్ సంస్థ తెలిపింది. ప్రపంచ కుభేరుల్లో గౌతమ్ అదానీ 24వ స్థానంలో ఉన్నారు. 2020లో ఆయన సంపద 890 కోట్ల డాలర్లు కాగా.. 2021లో 5,500 కోట్ల డాలర్లకు పెరిగింది. భారత్లో కొవిడ్ తో మిగతా రంగాలు కుదేలవుతున్నా.. అదాని సంపద మాత్రం అమాంతం పెరిగింది. అయితే ఆయన ఆస్ట్రేలియాలో కొత్తగా కొన్న కెమికల్ గనులు, ముంబై విమానాశ్రయంలో 74 శాతం వాటా దక్కించుకోవడం వంటివి ఆయన సంపద పెరుగుదలలో ఉన్నాయి.

ఇండియాలో పేదరికం రోజురోజుకూ మరింత పెరుగుతున్నా ప్రభుత్వం వారి సామాజిక భద్రతపై దృష్టి పెట్టలేదని ఆక్స్ ఫామ్ తెలిపింది. నిరుపేదలు, పేదలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం చెల్లిస్తున్నారు. వాటిని సామాజిక అభివృద్ధికి ఉపయోగించలేదని కొందరు వాదిస్తున్నారు. 2021 తొలి ఆరునెలల్లో ఇండియాకు చమురు మీదే 33 శాతం అధికంగా పన్ను వచ్చింది. ఇక ద్రవ్యోల్భణం తదితర మార్గాల ద్వారా పేదలు న్యాయంగా ప్రభుత్వానికి సరైన పన్నులు చెల్లిస్తున్నారు. కానీ వీటిని కొవిడ్ సమయంలో వారికి సరైన విధంగా ఉపయోగించలేదు. అయితే ధనవంతులకు సంబంధించిన సంపద పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే వారి నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం వల్ల 1.5 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయినట్లయింది.