Begin typing your search above and press return to search.

కొత్త సచివాలయం డిజైన్ వెనుక లెక్కలు రివీల్

By:  Tupaki Desk   |   10 July 2020 2:30 AM GMT
కొత్త సచివాలయం డిజైన్ వెనుక లెక్కలు రివీల్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పంటగా అభివర్ణించే సరికొత్త సచివాలయానికి సంబంధించిన ఫైనల్ డిజైన్ ను ఇప్పటికే ఓకే చేయటం తెలిసిందే. సచివాలయానికి చాలామంది డిజైన్లు ఇచ్చినా.. చివరకు ఆ అవకాశాన్ని దక్కించుకున్నది మాత్రం చెన్నైకి చెందిన అస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ. దీన్నినిర్వహిస్తున్న భార్యభర్తలు ఇద్దరూ ఈ డిజైన్ ను రూపొందించారు. దాదాపు ఎనిమిది నెలల పాటు శ్రమించి రూపొందించిన తమ డిజైన్ ను సీఎం కేసీఆర్ ఓకే చెప్పటంపై ఆనందాన్ని వారు వ్యక్తం చేస్తుననారు.

తాజాగా ఓకే చేసిన సచివాలయ భవన డిజైన్ కు స్ఫూర్తి నిజామాబాద్ లోని నీల కంఠేశ్వరాలయం గా చెబుతున్నారు. కాకతీయుల నాటి నిర్మాణ శైలి.. దక్కన్ కల్చర్ తో పాటు పచ్చదనం.. పర్యావరణ రహితంగా ఉండేలా తమ డిజైన్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. స్థలాన్ని వేస్ట్ చేయకుండా వందశాతం వాస్తుకు తగ్గట్లుగా తమ డిజైన్ ను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

మంత్రులకు.. అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా సచివాలయ డిజైన్ ను రూపొందించినట్లు వారు చెబుతున్నారు. శైవ ఆలయాలతో పాటు.. హైదరాబాద్ లోని కుతుబ్ షాహీలు.. అసఫ్ జాహీలు నిర్మించిన కట్టడాల్ని తాము పరిశీలించిన తర్వాతే డిజైన్లను రూపొందించినట్లు చెప్పారు.

తాము దేశంలోని వివిధ కట్టడాలకు డిజైన్లు ఇచ్చినట్లు చెప్పినవారు.. పలు దేశాల్లోని నిర్మాణాలకు పని చేసినట్లు చెప్పారు. సింగపూర్.. మలేసియా లాంటి దేశాల్లోని షాపింగ్ మాల్స్.. హోటళ్లకు డిజైన్లు ఇచ్చారు. చెన్నైలోని ఎల్నెట్ ఐటీ పార్కుతోపాటు సిటీ లైఫ్ పార్కు.. తంజావూర్ వర్సిటీ బవనాలకు డిజైన్లు రూపొందించిన ఘనత వీరి సొంతం. ఏపీలోనూ వరల్డ్ తెలుగు మ్యూజియం నిర్మాణానికి డిజైన్ తామే ఇచ్చినట్లుగా వారు చెబుతున్నారు.