Begin typing your search above and press return to search.

ఆపరేషన్ తెలంగాణా : ల్యాండ్ అవుతున్న ప్రత్యేక విమానాలు..?

By:  Tupaki Desk   |   14 May 2022 8:28 AM GMT
ఆపరేషన్ తెలంగాణా :  ల్యాండ్ అవుతున్న ప్రత్యేక విమానాలు..?
X
ఢిల్లీ నుంచి వరసబెట్టి ప్రత్యేక విమానాలు తెలంగాణా వైపుగా దూసుకువస్తున్నాయి. తెలంగాణాలోకి బడా నాయకులు నేరుగా ల్యాండ్ అవుతున్నారు. నార్త్ చూపు అలా సౌత్ వైపు పడుతోంది. అందునా తెలంగాణా గడ్డ మీదనే దృష్టి పెడుతున్నారు. మరి తెలంగాణాలో పొలిటికల్ వ్యాక్యూం అంతలా ఉందా. లేక టీయారెస్ ఈసారి కచ్చితంగా గెలవదు అన్న అంచనాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

నిజానికి టీయారెస్ రెండు సార్లు వరసబెట్టి అధికారంలోకి వచ్చింది. సహజంగానే ఆ పార్టీ మీద జనాలలో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. దాంతో పాటు ఈసారి తాము కష్టపడితే కచ్చితంగా అధికారంలోకి రావచ్చు అని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో ఈ హడావుడి ఎక్కువ అయింది.

కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే తెలంగాణా అంతటా పరచుకున్న పార్టీ అది. లీడర్లు ఎక్కువగానే ఉన్నారు. ఇక జనాల్లో కూడా ఎంతో కొంత పలుకుబడి ఉంది. అయితే నడిపించే నాయకుడే లేడు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ముందు పెట్టి కధ నడుపుతున్నా కాంగ్రెస్ లో వర్గ పోరు మరింత ఎక్కువగా ఉంది. ఈ పరిణామాల నేపధ్యలో ఈ నెల 6న తెలనగణా వచ్చిన కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.

పార్టీలో అంతా ఒక్కటిగా ఉండాలని, ప్రజలలో ఉండాలని సూచించారు. అదే సమయంలో ఆయన తెలంగాణా రాష్ట్ర సమితి మీద కూడా గట్టిగానే విమర్శలు చేశారు. టీయారెస్ రాజ్యం తెలంగాణా కానే కాదు అన్నారు. కేసీయార్ సీఎం లా ఉండాలి తప్ప రాజులా రాచరికం చేస్తే కుదరదు అని హెచ్చరించారు. తెలంగాణా రాష్ట్రం రావడంలో అందరి వాటా ఉందని చెబుతూ కాంగ్రెస్ ఇచ్చిన పార్టీగా జనాలకు గట్టిగా గుర్తు చేశారు. మొత్తానికి టీయారెస్ తో పోరంటే పోరే అని కాంగ్రెస్ నాయకులతో పాటు జనాలకు చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ గేర్ మార్చేశారు.

ఇక ఇపుడు బీజీపీ వంతు. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఊరూరా పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ పేల్చే పంచులకు జవాబు చెప్పే పనిలో టీయారెస్ కూడా ఉంది. ఒక విధంగా కాషాయ దళం బలం ఏంటో తెలియదు కానీ గత రెండేళ్ళుగా అధికార పార్టీని నానా హైరానా పెట్టేస్తోంది.

ఎన్నికల గోదాలోకి దిగితే ఈసారి అధికారం మాదే అని కాషాయం జబ్బలు చరుస్తూ ఒక విధంగా టీయారెస్ లో ఎక్కడ లేని గుబులు తెచ్చిపెడుతోంది. అది చాలదన్నట్లుగా ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇపుడు తెలంగాణాలో ల్యాండ్ అవుతున్నారు. ఆయన తన బాణాలను నేరుగా కేసీయార్ మీదనే ఎక్కుపెట్టనున్నారు.

గులాబీ పార్టీ పాలన ఇక చాలు అని బీజేపీ పెద్దలు అంటున్నారు. రాహుల్ వచ్చి గట్టిగా వారం కూడా కాలేదు, ఇపుడు అమిత్ షా టూర్ వేశారు. ఇప్పటికే రాహుల్ ప్రసంగానికి బదులు చెబుతూ నోరు నొప్పెట్టించుకున్న టీయారెస్ కి బీజేపీ మరింత పని పెడుతోంది. వస్తా మీ గల్లీకే వస్తా మళ్ళీ మళ్లీ వస్తా అంటూ అమిత్ షా చేస్తున్న సౌండ్ తో టీయారెస్ లో పెద్దలుగా ఉన్న కేటీయార్ కవిత ట్వీట్ల యుద్ధం మొదలెట్టేశారు.

మొత్తానికి చూస్తే అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీకి కూడా కామన్ ఫ్యాక్టర్ టీయారెస్. తెలంగాణా నుంచి రెండు జాతీయ పార్టీలకు చెందిన బిగ్ షాట్స్ వచ్చి అధికార పార్టీ మీద విరుచుకుపడడం వల్ల జనాలకు అయితే ఒక విషయం నేరుగా వెళ్లిపోతుంది. అదేంటి అంటే టీయారెస్ పాలన మీద పూర్తి వ్యతిరేకత. కేసీయార్ పాలన బాలేదు అని రాహుల్, అమిత్ షా వంటి పెద్దలు వచ్చి చెబితే ఎంతో కొంత జనాల మెదళ్లలోకి వెళ్లక తప్పదు మరి దాన్ని ఎలా వదిలించాలి అన్నదే ఇపుడు టీయారెస్ ని వేధిస్తున్న ప్రశ్న.

ఏది ఏమైనా తెలంగాణా ఆపరేషన్ కి కత్తులతో కటార్లతో బీజేపీ కాంగ్రెస్ రెడీ అయిపోయాయి. ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అయితే అధికారం తమదేనని జాతీయ పార్టీలు జోరు చేస్తున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీల నడుమ గులాబీ రేకులు నలిగిపోతున్నాయి. ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న కేసీయార్ కి ఇది నిజంగా కఠిన పరీక్షగా చెప్పకతప్పదు.

ఏకంగా ప్రత్యేక విమానాలు వేసుకుని ఢిల్లీ నేతలు ల్యాండ్ అవుతూంటే వారు విమర్శల ఘాటుని ధాటిని తట్టుకుని జవాబు చెప్పుకోవాల్సి రావడం అంటే చిన్న విషయం కాదు. దీంతో టీయారెస్ అయితే తెగ సతమతం అవుతోంది. మరి జాతీయ పార్టీలు వర్సెస్ ప్రాంతీయ పార్టీగా సాగుతున్న ఈ ఆపరేషన్ లో విజేత ఎవరో తెలియదు కానీ ఇరు వైపులా మద్దెల దరువు మాత్రం టీయారెస్ కి తప్పడంలేదు అంటున్నారు.