Begin typing your search above and press return to search.

షాకింగ్.. నెలలోపే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్!

By:  Tupaki Desk   |   13 Feb 2022 6:30 AM GMT
షాకింగ్.. నెలలోపే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్!
X
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. రోజురోజుకు కేసుల సంఖ్యలో గుణాత్మకమైన తరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మరణాలు కూడా తగ్గు ముఖం పట్టడం అధికారులు కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. ఇదిలా ఉంటే పాజిటివిటీ రేటు కూడా గతంతో పోల్చితే బాగా తగ్గింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.17గా ఉంది.

ఇది ఓ విధంగా చెప్పాలంటే శుభ సూచికమే అయినా.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అప్పుడే నశించేది కాదని నిపుణులు అంటున్నారు. వైరస్ నుంచి కోలుకున్న 30 నుంచి 45 రోజుల లోపే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ లోని కిమ్స్ వైద్యులు డా. వీవీ రమణ ప్రసాద్ తెలిపారు. అందుకే వైరస్ ఒక సారి వస్తే మరోసారి రాదు అనే భావనలో ఎవరూ ఉండొద్దని ఆయన చెబుతున్నారు. ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్లు త్వరగా తిరిగి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

కోవిడ్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఒక్కసారి సోకితే మరోసారి రాదు అని అనుకోవడం పొరపాటని డా. రమణ ప్రసాద్ తెలిపారు. నెగటివ్ వచ్చిన నెలా పదిహేను రోజుల లోపు మరల కొందరు వైరస్ బారిన పడుతున్నట్లు చెప్పారు. అందుకే వైరస్ కు ఎక్స్ పోజ్ కాకుండా ఉండాలని అన్నారు. వైరస్ తిరిగి మనపై దాడి చేయడానికి కేవలం కొద్ది రోజుల సమయం సరిపోతుందని ఆయన అన్నారు.

ఇలాంటి కేసుల చాలా ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. అందుకే కోవిడ్ పూర్తిగా తగ్గేదాక ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాల్సి ఉంటుందని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైరస్ నుంచి త్వరగా బయటపడవచ్చని తెలిపారు.

ఈ క్రమంలోనే వైరస్ రెండోసారి వచ్చిన వారికి ఉండే లక్షణాలను డా. రమణ ప్రసాద్ వివరించారు. కోవిడ్ రెండవ సారి వచ్చిన వారిలో కూడా తీవ్ర ప్రభావం ఏమీ చూపడం లేదని తెలిపారు. గతంలో లాగే కొవిడ్ లక్షణాలు ఉంటాయిని పేర్కొన్నారు.

అయితే వారు చూసిన కేసుల్లో ఎక్కువ భాగం టీకా తీసుకుని వారివే అని చెప్పారు. అందులోనూ కోవిడ్ టీకా తీసుకొని వారే ఎక్కువగా ఆసుపత్రిల్లో చేరుతున్నట్లు వివరించారు. మరి కొంతమంది చాలా కాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని ఆయన ఆన్నారు.

ప్రస్తుతం ఆసుపత్రి పాలు అయ్యే వారిలో ఎక్కువ మంది కోవిడ్ సాధారణ లక్షణాలతోనే ఉంటున్నారని డా. రమణ ప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులు లాంటివి వాటితో బాధపడుతున్నట్లు చెప్పారు. మరి కొంతమంది లక్షణాలు లేకపోయినా కానీ పాజిటివ్ వస్తే చికిత్స తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

ఎక్కువ మందిలో నిద్రపోయే సమయానికి బాగా దగ్గు రావడం జరుగుతుందని.. దీంతో శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు చాలా మందిలో ఆస్తమా సమస్యలు పెరుగుతున్నట్లు చెప్పారు. అందుకే వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలి సూచించారు.