Begin typing your search above and press return to search.

అణుయుద్ధం జరిగితే ప్రపంచంలో సగం జనాభా నాశనం

By:  Tupaki Desk   |   16 Aug 2022 10:30 AM GMT
అణుయుద్ధం జరిగితే ప్రపంచంలో సగం జనాభా నాశనం
X
ఇంతటి ఆధునిక స్వేచ్ఛా యుగంలోనూ యుద్ధాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. పొరుగున ఉండే ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా అక్కడ శవాల దిబ్బను ఏర్పాటు చేసింది. ఎంతో మంది ప్రజల మాన, ప్రాణాలు తీసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధోన్మాదం.. ఉక్రెయిన్ పక్కలో బల్లెంలాంటి చర్యలు ఈ యుద్ధానికి పురిగొల్పాయి. మధ్యలో ప్రజలు నలిగిపోయారు.

ఈ యుద్ధం ఇంకా ముగియకముందే.. ఇప్పుడు చైనా-తైవాన్ -అమెరికా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ లోకి అమెరికా స్పీకర్ రాక.. తర్వాత చైనా విమానాల యుద్ధ విన్యాసాలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వీటన్నింటి మధ్య అణుయుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి.

అణ్వాయుధాలు కలిగిన దేశాలు యుద్ధానికి దిగితే పరిస్థితులేంటి? అన్న సందేహాలు కలుగక మానవు. అణుయుద్ధం వస్తే జరిగే ప్రాణ నష్టంపై తాజాగా ఓ నివేదిక బయటకు వచ్చింది. అణుయుద్ధం కనుక జరిగితే ప్రపంచంలోని సగం జనాభా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని తేలింది. ఈ యుద్ధంలో 5 బిలియన్ల మంది మరణిస్తారని అంచనావేసింది.

జర్నల్ నేచర్ ఫుడ్ అనే సంస్థ సమర్పించిన నివేదిక ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని రూట్ గీర్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు.అణుయుద్ధానికి చెందిన ఆరు పరిస్థితులను నివేదికలో ప్రస్తావించారు.

అమెరికా-రష్యా మధ్య అణుయుద్ధం జరిగితే ప్రపంచ జనాభాలోని సగం మానవాళి నాశనమైపోతుందని పేర్కొన్నారు. అణుయుద్ధంతో వాతావరణంలో కలిగే మార్పులు, పంటనష్టం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదికను రూపొందించారు. అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్పెరిక్ రీసెర్చ్ సాయం తీసుకున్నారు.

యుద్ధం జరిగితే ప్రపంచ ఆహార ఉత్పత్తి దారుణంగా ప్రభావితమవుతుందని తేలింది. ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పంట ఉత్పత్తి 5 ఏళ్లలో 7శాతం పతనం అవుతుంది. ఇప్పటికే ఆకలితో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఇది మరింత నష్టం చేకూరుస్తుంది.

ఇక అమెరికా-రష్యా గొడవతో 3-4 ఏళ్లలోనే 90శాతం పంట ఉత్పత్తి పడిపోతుంది. అణుయుద్ధాన్ని ముందే పసిగట్టి.. ఆహార ఉత్పత్తులను దాచుకున్నప్పటికీ తర్వాత జరిగే నష్టం నుంచి ప్రపంచాన్ని రక్షించడం ఎవరికీ సాధ్యం కాదని ఈ నివేదిక తేల్చింది. అసలు తినడానికి మనుషులే మిగలరని ఆందోళన వ్యక్తం చేసింది.