Begin typing your search above and press return to search.

వైసీపీలో కొత్త వ్యవస్థ : ఇక ఎమ్మెల్యేలతో నేరుగా జగన్ ...?

By:  Tupaki Desk   |   26 Jun 2022 2:30 AM GMT
వైసీపీలో కొత్త వ్యవస్థ : ఇక ఎమ్మెల్యేలతో నేరుగా జగన్ ...?
X
వైసీపీలో ఇపుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు గోల పెడుతున్నారు. అధినాయకుడు సీఎం కూడా అయిన జగన్ దర్శన భాగ్యమే తమకు లభించడం లేదని వాపోతున్నారు. మొత్తానికి ఈ విన్నపాలు అన్నీ జగన్ కి వినిపించాయనుకోవాలి.

ప్లీనరీ తరువాత వైసీపీలో మొత్తం సీన్ మారిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మీదట ఎమ్మెల్యేలు ఎవరైనా నేరుగా జగన్ తో మాట్లాడే విధంగా తమ బాధలు చెప్పుకునే విధంగా ప్రభుత్వ స్థాయిలో ఒక కీలక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

అదే టైమ్ లో సీఎంవోతో ఎమ్మెల్యేలను అనుసంధానం చేస్తారని తెలుస్తోంది. వారు తమ నియోజకవర్గంలో ఉన్న ఏ చిన్న సమస్యను అయినా అక్కడ మేసేజ్ ద్వారా పెట్టినా తక్షణ చర్యలకు రంగం తీసుకునేలా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థాయిలో జరగనున్న అతి ముఖ్యమైన మార్పు అయితే ఇక పార్టీని కూడా సమూలంగా మార్చి కొత్త రూపూ షేపూ తెచ్చేలా భారీ మార్పులు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది

అదేంటి అంటే వైసీపీకి జిల్లా కమిటీలు ఉన్నాయి. మూడు నాలుగు జిల్లాలకు కలిపి రీజనల్ కో ఆర్డినేటర్స్ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అయితే కమిటీలు ఉన్నాయి. కానీ ఇపుడు వాటితో పాటు పార్టీలో అత్యున్నత వేదికగా కోర్ కమిటీని ఒక దాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది

ఇందులో అన్ని ప్రాంతాలు, సామాజిక సమీకరణలను కలుపుకుంటూ సీనియర్లను నియమిస్తారు అని తెలుస్తోంది. మొత్తం 18మంది దాకా ఈ కోర్ కమిటీలో ఉంటారని అంటున్నారు. ఈ కోర్ కమిటీ నిరంతరం జిల్లా కమిటీలతో టచ్ లో ఉంటుంది. అలాగే రీజనల్ కో ఆర్డినేటర్స్ కూడా ఈ కమిటీతో ఉంటారు.

అలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఏం చేయాలన్న దాని మీద ఎప్పటికపుడు పార్టీ అధినాయకత్వానికి కోర్ కమిటీ నివేదిక ఇస్తుంది అని చెబుతున్నారు. మొత్తానికి ప్లీనరీ తరువాత అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ప్రక్షళన చేసే విధంగా జగన్ అడుగులు వేగంగా వేస్తున్నారు .