Begin typing your search above and press return to search.

కరోనా వాలంటీర్లకు నోటిఫికేషన్..ముందుకొచ్చే వారికీ బంపర్ ఆఫర్!

By:  Tupaki Desk   |   9 April 2020 9:50 AM GMT
కరోనా వాలంటీర్లకు నోటిఫికేషన్..ముందుకొచ్చే వారికీ బంపర్ ఆఫర్!
X
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా రోగులను - లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలను రక్షించేందుకు దాతలు ఎందరో ముందుకు వస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం రోగులను రక్షించేందుకు వారి వంతు కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో వారు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఈ సమయంలో ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కోవిడ్ 19 వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దీనిలో భాగంగా నియామకాలు కూడా చేపట్టింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు - పారా మెడికల్‌ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం. గిరిజాశంకర్ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 271 మెడికల్ కాలేజీలు - డెంటల్ కాలేజీలు - యునాని - ఆయుర్వేద నర్సింగ్ కాలేజీలు.. ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు వాలంటీర్లకు అప్లై చేసుకోవచ్చని ఆ ప్రకటన ద్వారా తెలియజేశారు.

అలాగే, ఆసక్తి ఉన్న వైద్యులు - వైద్య సిబ్బంది - అనుభవం గల నర్సులు - పారా మెడికల్‌ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్‌ వారియర్స్‌ గా పని చేసేందుకు ముందుకు రావొచ్చని తెలిపారు. వీరి సేవలను ఆస్పత్రుల్లో - క్వారంటైన్‌ సెంటర్లలో వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే వాలంటీర్లగా ఎంపికైన వారి సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటామని తెలిపారు. కరోనా వారియర్స్ గా సేవ చేయడానికి ఆసక్తి కలిగిన వారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్‌ సైట్‌ లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇదే సమయంలో ఆలా కోవిడ్ వారియర్స్ గా తమ సేవలని అందివ్వడానికి ముందుకు వచ్చే వారికి ఏపీ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్‌ ను ప్రకటించింది. వీరికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌ మెంట్‌ లో మొదటి ప్రాధాన్యమిస్తామని తెలిపింది.