Begin typing your search above and press return to search.

రాకెట్ మ్యాన్ మళ్లీ నిద్ర లేచాడు

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:47 AM GMT
రాకెట్ మ్యాన్ మళ్లీ నిద్ర లేచాడు
X
ఉత్తరకొరియా మరో దుస్సహాసానికి దిగింది. ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలో ఉత్తరకొరియా తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. అణ్వాయుధాలపై నిషేధాన్ని విధించిన తర్వాత మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అణురహిత ఆయుధాలను సమకూర్చుకుంటోంది.

తాజాగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిస్సైళ్లు, వాటిని సంధించడానికి వినియోగించే ట్యాంకులను కొనుగోలు చేస్తోంది. ఉత్తరకొరియా దూకుడు, ఆసియా ఖండంలో ఒకింత ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతోందని దేశాలు భయపడుతున్నాయి.

ఓవైపు ఉత్తరకొరియా దేశం ఆహార కొరతతో అల్లాడుతోంది. తినడానికి తిండి దొరకడం లేదు. అయినప్పటికీ ఇవేమీ లెక్క చేయకుండా ఉత్తరకొరియా ఆయుధాలను పెంపొందించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోంది.

తాజాగా అత్యాధునిక క్షిపణిని ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ ఇది. ఏకంగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన టార్గెట్ ను తునాతునకలు చేయదగ్గ శక్తి సామర్థ్యాలు ఈ మిస్సైల్ సొంతం. ప్యాటర్న్ 8 ఫ్లయిట్ ఆర్బిట్ గా దీన్ని పిలుస్తారు. ఓ గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఈ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థ తెలిపింది. 1500 కి.మీల దూరంలో ఉన్న టార్గెట్ ను ఈ మిస్సైల్ చేధించినట్లు తెలిపింది. లక్ష్యాన్ని కేవలం 7580 సెకన్ల వ్యవధిలో అధిగమించినట్టు స్పష్టం చేసింది. ఈనెల 11, 12 తేదీల్లో క్షిపణుల పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది.

ఈ ఏడాది మార్చిలోనే ఉత్తరకొరియా చివరిసారిగా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణలు, క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించింది. ఆ కిందటి నెలలోనే అంటే.. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్ తో సుమారు కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడాడు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే మరో క్షిపణి పరీక్ష చేయడం సంచలనమైంది.ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో ఆసియా ఖండంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ముఖ్యంగా పక్కనే ఉన్న దక్షిణకొరియా, జపాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.