Begin typing your search above and press return to search.

ఆ దేశంలో గ్ర‌హాంతర వాసుల వ‌ల్లే క‌రోనా చెందిందా?

By:  Tupaki Desk   |   3 July 2022 1:46 PM GMT
ఆ దేశంలో గ్ర‌హాంతర వాసుల వ‌ల్లే క‌రోనా చెందిందా?
X
రెండేళ్ల క్రితం కోవిడ్ -19 వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేసింది. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వ‌ర్ధమాన దేశాల వ‌ర‌కు అన్ని దేశాలు కోవిడ్ ధాటికి అల్ల‌క‌ల్లోల‌మ‌య్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 80 ల‌క్ష‌ల మంది ఈ వైర‌స్ కు బ‌ల‌య్యార‌ని అధికారిక లెక్క‌లే తెలుపుతున్నాయి. కానీ అంత‌కంటే ఎక్కువ మ‌ర‌ణించి ఉండొచ్చ‌ని అని అంచ‌నా.

ఇప్పుడు తాజాగా మ‌రోమారు ఉత్త‌ర కొరియా కోవిడ్ తో విల‌విల‌లాడుతోంది. ఆ దేశంలో ల‌క్ష‌ల్లో కేసులు పెరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం కోవిడ్ విజృంభించిన‌ప్పుడు ఉత్త‌ర కొరియాలో అంత‌గా క‌రోనా కేసులు వ్యాప్తి చెంద‌లేదు. ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా క‌రోనా తీవ్ర‌త త‌గ్గింద‌నుకుంటున్న త‌రుణంలో ఉత్త‌ర కొరియాలో కోవిడ్ వీర‌విహారం చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జోంగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశంలో క‌రోనా వ్యాప్తికి గ్ర‌హాంత‌ర వాసులే కార‌ణ‌మంటున్నారు. ఉత్త‌ర కొరియాలో తొలి కేసు కూడా గ్రహాంత‌ర వాసుల వ‌ల్లే వ‌చ్చిందంటున్నారు. తన దాయాది దేశం ద‌క్షిణ కొరియా స‌రిహద్దుల నుంచి గ్ర‌హాంత‌ర వాసులు బెలూన్ల‌లో నింపి వైర‌స్ ను త‌మ దేశంలో వ‌దులుతున్నార‌ని కిమ్ జోంగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం కిమ్ జోన్ ఉన్ క‌రోనా వ్యాప్తికి ద‌క్షిణ కొరియా కార‌ణ‌మ‌ని నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణ కొరియా నుంచి అనుమానాస్పద రీతిలో వైరస్‌ తమ దేశంలోకి ప్రవేశించిందంటూ కిమ్ ధ్వ‌జ‌మెత్తారు. రెండు దేశాల మ‌ధ్య సరిహద్దుల వెంట‌ ఉన్న ప్రాంతాల్లో గాలి, ఇతర వాతావరణ పరిస్థితులు, బెలూన్లు.. ఇతరత్ర వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల‌ని ఆయ‌న త‌న దేశ‌స్తుల‌ను కోరారు.

కాగా ఉత్త‌ర కొరియాలో ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో కుమ్‌గాంగ్‌ రీజియన్‌లో 18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారిలో తొలిసారి వైరస్‌ లక్షణాలు వెలుగుచూశాయి. కొండప్రాంతం నుంచి అనుమానాస్పద కదలికల వల్లే వాళ్లు వైరస్ బారిన పడ్డట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. బెలూన్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి జరిగింది. ఆపై అదే రీజియన్‌లోని ఇఫో-రి ప్రాంతం నుంచి వచ్చిన కొందరి కారణంగా.. ఉత్తర కొరియా మొత్తం వైరస్‌ వ్యాప్తి చెందింది. దీనంతటికి పొరుగు దేశం కారణమని అత్యున్నత దర్యాప్తులో తేలింద‌ని ఉత్త‌ర కొరియా చెప్పింది. ద‌క్షిణ కొరియా బయో వార్‌ కోసం ప్రయత్నించింద‌ని ఉత్తర కొరియా తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. ఇప్పుడేమో గ్ర‌హాంత‌ర వాసుల వల్లే క‌రోనా వ్యాప్తి చెందిందంటూ వ్యాఖ్య‌లు చేశారు.