Begin typing your search above and press return to search.

కరోనా పై మోడీ చేతులెత్తేసినట్టేనా?

By:  Tupaki Desk   |   18 Jun 2020 9:10 AM GMT
కరోనా పై మోడీ చేతులెత్తేసినట్టేనా?
X
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. కేసులు మరింత పెరిగేలా పరిస్థితి ఉంది. మొదట్లో లాక్ డౌన్ తో రెండు నెలలపాటు దేశ ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి నియంత్రించి సత్ఫలితాలు సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్న వేళ చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది.

తాజాగా సీఎంలతో భేటిలో తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నకు ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ కాలం ముగిసిందని.. ఇది అన్ లాక్ సీజన్ అని బదులిచ్చారు. అన్ లాక్ 2పైనే తమ దృష్టి అంతా ఉందని క్లారిటీ ఇచ్చారు.

ప్రపంచంలోనే కేసుల నమోదులో భారత్ ప్రస్తుతానికి 4వ స్థానానికి చేరుకుంది. ఈ కేసులు మరింత పెరిగి దేశం ప్రమాదకర స్థితికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా తర్వాత వేగంగా విస్తరిస్తున్న కేసులు భారత్ లోనే కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా ఊరువాడలకు విస్తరించింది. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే మొదట లాక్ డౌన్ పేరిట కలవరపెట్టిన మోడీ ఇప్పుడు ఇన్ని కేసులు పెరుగుతున్నా చోద్యం చూస్తుండడం.. కరోనాను గాలికి వదిలేయడమే అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ప్రస్తుతం సీఎంలతో భేటిని చూశాక ప్రధాని మోడీ దేశంలో కరోనా వైరస్ పై చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. రాష్ట్రాలపై భారం మోపి తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే 20 లక్షల కోట్ల ప్యాకేజీ గాలిబుడగ కావడం.. కరోనా నియంత్రణలోకి రాకపోవడంతో.. ఇప్పుడు రాష్ట్రాలపైనే కరోనా కేసులు వదిలేసి ప్రధాని మోడీ పూర్తిగా చేతులెత్తేసినట్టే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.