Begin typing your search above and press return to search.

ఆ మంత్రి ఎంతగా పొగిడినా రెస్సాన్స్ లేదా!

By:  Tupaki Desk   |   16 Oct 2019 7:54 AM GMT
ఆ మంత్రి ఎంతగా పొగిడినా రెస్సాన్స్ లేదా!
X
నెల్లూరులో జరిగిన రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెద్ద ప్రసంగమే చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బాగా పొగిడారు ఈ మంత్రి. అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును తీవ్రంగా విమర్శించారు. అలాగే తను జగన్ కు వీర విధేయ సైనికుడిని అని అంటూ గట్టిగా చెప్పుకున్నారు. తనను మంత్రిని చేసినందుకు గానూ జగన్ కు జీవితమంతా రుణపడి ఉండబోతున్నట్టుగా అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించుకున్నారు.

ఈ పొగడ్తలు - ప్రత్యర్థులపై విమర్శలు - తన వీరవిధేయతను చెప్పుకోవడం.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఎటొచ్చీ ఆయన ప్రసంగానికి పెద్దగా రెస్పాన్స్ రాలేదనే టాక్ వినిపిస్తూ ఉంది. అనిల్ కుమార్ యాదవ్ వీరావేశంతో ప్రసంగం చేసినప్పటికీ.. అక్కడ ఉన్న జనం నుంచి పెద్దగా స్పందన వ్యక్తం కాలేదని సమాచారం.

అందుకు పలు కారణాలున్నాయి. మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత జిల్లా నేతల్లోనే వ్యతిరేకత ఉంది. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయన తీరుపట్ల అంత సానుకూలంగా లేరని సమాచారం. సీనియర్లను - తన కన్నా ముందే పార్టీలో యాక్టివ్ గా ఉండిన వాళ్లను కూడా మంత్రి అంత ఖాతరు చేయడం లేదనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నేతలు అనిల్ కు దూరం అయ్యారు.

వారి వారి అనుచరగణం కూడా అనిల్ పై వ్యతిరేకతను పెంచుకుంది. ఇక సభలో ఎలాగూ స్థానిక ప్రజలే ఉంటారు. స్థానిక వైసీపీ క్యాడర్ సభకు భారీగా హాజరైంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పై వ్యతిరేకత సభలో కనిపించింది. ఇలాంటి పరిణామాల మధ్యన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనిల్ గట్టిగానే తన విధేయతను చాటుకున్నారు. అయినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

మంత్రి తీరుపై ఉన్న వ్యతిరేకతతో ఆయన జగన్ ను పొడిగినా - చంద్రబాబు నాయుడుని తిట్టినా వింటు జనంలో మాత్రం స్పందన రాకుండా చేసిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.