Begin typing your search above and press return to search.

గ్రేటర్ వార్...టీటీడీపీకి ఆ దుస్థితి వచ్చింది

By:  Tupaki Desk   |   21 Nov 2020 2:30 PM GMT
గ్రేటర్ వార్...టీటీడీపీకి ఆ దుస్థితి వచ్చింది
X
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన వైసీపీ, టీడీపీలు తెలంగాణలో నామ మాత్రంగా రాజకీయాలు చేసేవి. ఆ తర్వాత ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి రావడంతో తెలంగాణలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా జరుగబోతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆ విషయం స్పష్టమవుతోంది. బల్దియా పోరులో నామమాత్రంగా పోటీ చేస్తోన్న టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు బడా నేతలెవరూ రాని పరిస్థితి. అప్పుడెప్పుడో టీడీపీ నేతగా ఉన్న తలసాని శ్రీనివాస్...చంద్రబాబును పొగిడిన వీడియోలను ఇప్పుడు ప్రచారానికి వాడుతున్నారంటే ఓటుకు నోటు కేసు ఎఫెక్ట్ ఎంతగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ప్రచారానికి వస్తే మైలేజీకన్నా డ్యామేజీ ఎక్కువని.... మా ప్రచారం మేము చేసుకుంటాం మహాప్రభో అని టీడీపీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్,బీజేపీల మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎం తనకు తానే రాజు తానే మంత్రి కాబట్టి ఆ పార్టీ అభ్యర్థుల తమ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక, గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని చిత్తయిన కాంగ్రెస్, టీడీపీలు ఆటలో అరటిపండులా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా మినహా ఆ పార్టీకి తగిన ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఇక, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఆ పాయింట్ పై ఓట్లు అడిగే పరిస్థితి ఎప్పుడో పోయింది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని గ్రేటర్ బరిలో టీడీపీ తరఫున పోటీచేయడం ఒక్కటే ఆ పార్టీకి ప్రధాన ఆకర్షణ. మరోవైపు, టీడీపీ నేతలను ఓటుకు నోటు కేసు భయం వెంటాడుతోంది. దానికితోడు అక్టోబర్ 12వ తారీకున రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తే ఆ విషయం తెరపైకి తెచ్చేందుకు టీఆర్ఎస్ రెడీగా ఉంది. కాబట్టి, చంద్రబాబు రాకున్నా పర్లేదన్న భావన టీడీపీ అభ్యర్థుల్లో ఉందట. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తమ పార్టీ ఇపుడు పాత వీడియోలను ప్రచారానికి వాడుకోవాల్సిన పరిస్థితి రావడంపై టీ.తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా పార్టీ ఉనికిని కాపాడేందుకు గ్రేటర్ వార్ లో తమ వంతు ప్రయత్నం చేయాలని వారు భావిస్తున్నారట.