Begin typing your search above and press return to search.

ధర్మపురి సంచలనం..కేసీఆర్ బతకాలట - టీఆర్ ఎస్ చావాలట!

By:  Tupaki Desk   |   17 Sep 2019 3:51 PM GMT
ధర్మపురి సంచలనం..కేసీఆర్ బతకాలట - టీఆర్ ఎస్ చావాలట!
X
కేంద్రంలో వరుసగా రెండో పర్యాయం అదికారాన్ని చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా స్పీడుగా దూసుకెళుతోందనే చెప్పాలి. తెలంగాణలో వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకున్న టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథులు... ఆ వ్యూహాలకు చాలా స్పీడుగానే పదును పెడుతోంది. ఈ క్రమంలో కమలం గుర్తుపై మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీట్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసీఆర్ తనయ కవితను చిత్తుగా ఓడించిన యువ నేత ధర్మపురి అరవింద్... తనదైన శైలిలో టీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన అరవింద్... కేసీఆర్ పై సంచలనాలకే సంచలనాలుగా నిలిచే కామెంట్లు చేశారు. కేసీఆర్ వందేళ్లు బతకాలని కోరుకున్న ఆయన... టీఆర్ ఎస్ ను మాత్రం కేసీఆర్ చూస్తుండగానే చంపేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంతం కేసీఆర్ టార్గెట్ గానే సాగిన అరవింద్ ప్రసంగం ఇప్పుడు తెలంగాణలో పెను సంచలనంగా మారింది.

అయినా కేసీఆర్ టార్గెట్ గా అరవింద్ ఏమన్నారన్న విషయానికి వస్తే.. తెలంగాణలో వరుసగా రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ ఎస్ మరో మూడు పర్యాయాలు అధికారంలోనే ఉంటానని భావిస్తోందని - అయితే ప్రస్తుత టీఆర్ ఎస్ సర్కారు తన టెర్మ్ ను పూర్తి చేసుకోకుండానే మధ్యలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా మూడు నెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంటుందని కూడా అరవింద్ అన్నారు. కేసీఆర్ చనిపోవాలని విపక్షాలు కోరుకుంటున్నాయంటూ టీఆర్ ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండించిన అరవింద్.. కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇందుకు కారణం కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ ను తెలంగాణలో పూర్తిగా చంపేయబోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేసిన అరవింద్... టీఆర్ ఎస్ చనిపోవడాన్ని కేసీఆర్ కళ్లారా చూడాలని కూడా వ్యాఖ్యానించారు. మొత్తంగా కేసీఆర్ వందేళ్లు బతకాలని కోరుకుంటున్నామని చెప్పిన అరవింద్... కేసీఆర్ బతికుండగానే టీఆర్ ఎస్ ను చంపేస్తామంటూ సంచలనాలకే సంచలనమైన కామెంట్ చేశారు.

అంతటితో ఆగని అరవింద్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. చెంచాలకే చెంచాగా వ్యవహరిస్తున్న మజ్లిస్ అదినేత అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్ చెంచాగా మారిపోయారని మరో సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించకుండా అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడం ఎందుకని ప్రశ్నించిన అరవింద్... అందులోని లాజిక్ ఇదేనంటూ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలంలో కేసీఆర్ లేరని - అయితే ఇప్పుడు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తే తనకు పేరు రాదని భావిస్తున్న కారణంగానే కేసీఆర్ విమోచనా దినాన్ని కావాలనే పక్కనపెడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ లో బీజేపీకి దక్కిన గ్రాండ్ విక్టరీని మరోమారు గుర్తు చేసిన అరవింద్... భవిష్యత్తులో నిజామాబాద్ జాబితాలో కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ - సిద్ధిపేటలు కూడా చేరతాయని వ్యాఖ్యానించారు. తదుపరి ఎన్నికల్లో నిజామాబాద్ మాదిరి ఫలితాలే గజ్వేల్ - సిద్దిపేటల్లోనూ వస్తాయని - ఆ రెండు చోట్లా టీఆర్ ఎస్ ఓడిపోవడంతో పాటుగా బీజేపీ సంచలన విజయాలు నమోదు చేస్తుందని అరవింద్ జోస్యం చెప్పారు. మొత్తంగా కేసీఆర్ భవిష్యత్తు - టీఆర్ ఎస్ ఫ్యూచర్ లపై సంచలన కామెంట్లు చేసిన అరవింద్ తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కించారనే చెప్పాలి.