Begin typing your search above and press return to search.

కేటీఆర్ వాదనకు నిర్మలమ్మ కౌంటర్ ఇచ్చేశారుగా..

By:  Tupaki Desk   |   17 Feb 2020 6:00 AM GMT
కేటీఆర్ వాదనకు నిర్మలమ్మ కౌంటర్ ఇచ్చేశారుగా..
X
ఇటీవల కాలంలో వేదిక ఏదైనా.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక విషయాన్ని అదే పనిగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించటం లేదని.. తాము చెల్లిస్తున్న పన్నుల వాటాకు రాష్ట్రానికి తిరిగి దక్కుతున్నది తక్కువేనని ఆయన చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆదివారం జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలోనూ సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు తక్కువగా ఉన్నాయన్న వాదన సరికాదని ఆమె చెప్పారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చేస్తున్న వాదనలు తమ ముందుకు వచ్చాయని.. ఇది సరికాదన్నారు. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిందని చెప్పారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరిగిన నేపథ్యం లో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు తగ్గట్లే తాము నిధులు ఇచ్చామన్నారు.

తమకు తక్కువగా నిధుల కేటాయింపు జరుగుతుందన్న మంత్రి కేటీఆర్ విమర్శలకు కౌంటర్ గా నిర్మలమ్మ కొన్ని ఫిగర్లను ప్రస్తావించారు. గతంతో పోలిస్తే.. తమ హయాం లోనే తెలంగాణ కు ఎక్కువగా నిధులు వచ్చాయన్న మాటను చెప్పుకొచ్చారు. 2010-15 మధ్యన రూ.46,747 కోట్లు తెలంగాణ కు వస్తే.. 2015-20 మధ్య కాలంలో తాము రూ.1,06,606 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.

గతం కంటే తమ ప్రభుత్వం 128 శాతం అధికంగా నిధుల్ని ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ విషయం లో ఎఫ్ఆర్ బీఎం నిబంధనల సడలింపు తో రాష్ట్రం 0.5 వాతం రుణాల్ని అధికంగా తీసుకునే వీలుందన్నారు. జీఎస్టీ ద్వారా పరిహారం ఇవ్వకపోవటం ఒక్క తెలంగాణ కే కాదు..అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా చెప్పారు. జీఎస్టీ ప్రకారం కాంపెన్ సేషన్ సెస్ ద్వారానే ఈ సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఈ సెస్ తగ్గటంతోనే తాము ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. వసూలైన జీఎస్టీ పరిహారం ఇచ్చేశామని.. తర్వాత కూడా బాకీ ఉంటే సెస్ ద్వారా వచ్చే కొద్దీ ఇస్తామని చెప్పారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని తాము నిర్లక్ష్యం చేస్తున్నామన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్న విషయాన్ని నిర్మలమ్మ బలంగా చెప్పారని చెప్పాలి. మరీ.. మాటలకు మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఏమిటో చూడాలి.