Begin typing your search above and press return to search.

ఒంగోలు రాజకీయం : గంట కొట్టనున్న మాగుంట....?

By:  Tupaki Desk   |   1 July 2022 1:30 AM GMT
ఒంగోలు రాజకీయం : గంట కొట్టనున్న మాగుంట....?
X
ఒంగోలులో అధికార పార్టీ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. మూడేళ్ళ పాలన తరువాత మెల్లగా అసంతృప్తి బయటపడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ ఆవేదనను బయటేసుకుంటున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ లేటెస్ట్ గా జగన్ సర్కార్ మీద చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. మా గ్రాఫ్ తగ్గడానికి వైసీపీ ప్రభుత్వ పెద్దలే కారణం అని మద్దిశెట్టి కుండబద్ధలు కొట్టారు. దానికి ముందు అదే ఒంగోలు నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీ వారి మీదనే కారాలూ మిరియాలూ నూరారు. తన మీద కుట్ర జరుగుతోంది అని ఆయన బాంబు పేల్చారు. తేల్చుకోవడానికి రెడీ అని కూడా అల్టిమేటం ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డి మూడేళ్ళు గడచినా మౌన ముద్రలోనే ఉన్నారు అంటే అర్ధం చేసుకోవాలి. ఆయన ఊసు కానీ ఉనికి కానీ అధికార పార్టీలో లేకుండా చేశారు అన్న మాట వినిపిస్తోంది. మాగుంటకు బాలినేనికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సీన్ ఉంటుంది. మాగుంటను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ బాలినేని తనదైన రాజకీయం నడపడంతో మాగుంట లోలోన రగిలిపోతున్నారని టాక్.

ఈ మధ్య ఆయన ఒంగోలులో ట్రాఫిక్ సమస్యల మీద ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే దానికి ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు ఒక్కరు కూడా హాజరు కాలేదుట. అదే టైమ్ లో మాజీ మంత్రి బాలినేని నిర్వహించిన సమావేశంలో వారు కనిపించడం విశేషం. దీంతో తనకు చిన్నమెత్తు కూడా ప్రభుత్వంలో విలువ లేదా అని మాగుంట మండిపోతున్నారుట.

ఇక ప్రోటోకాల్ విషయంలోనూ అలాగే జరుగుతోందిట. లోకల్ లీడర్స్ ఆయనకు ఏ సంగతీ చెప్పడం కానీ ఆయన్ని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం కానీ చేయడంలేదుట. ఇక మాగుంటకు వైసీపీ నేతల మధ్య అంతరం అలా ఉంటే టీడీపీ వైపు నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నాయిట. నిజానికి ఆయన 2014లో టీడీపీలో చేరి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు

అయినా సరే 2019 ఎన్నికలో వైసీపీలోకి వచ్చి ఎంపీ అయ్యారు. ఇక మాగుంట ఫ్యామిలీ అంటేనే రాజకీయ కుటుంబంగా ఉంది. నెల్లూరు నుంచి వచ్చి ఒంగోలులో స్థిరపడిన మాగుంట సుబ్బరామిరెడ్డి చిన్నతమ్ముడే ఈ శ్రీనివాసులురెడ్డి. సుబ్బరామిరెడ్డి 1991 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఫస్ట్ టైమ్ గెలిచారు. అయితే ఆయన 1995 నక్సలైట్ల కాల్పులలో చనిపోయారు.

ఇక ఆయన సతీమణి పార్వతమ్మ ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన మీదట రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఆ మీదట రంగ ప్రవేశం చేసిన శ్రీనివాసులురెడ్డి 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు నుంచి మూడు సార్లు ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఇక 2019లో వైసీపీ నుంచి ఎంపీ అయ్యారు.

అయితే ఆయన వైసీపీలో వర్గ పోరు, తనను పట్టించుకోకపోవడం వంటి వాటి వల్ల అసలు ఏ మాత్రం ఇమడలేకపోతున్నారుట. ఆయన వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఎంపీలు అనేక మంది అసంతృప్తిగా ఉంటే వారిలో తొలి గంట కొట్టేది మాగుంట అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.