Begin typing your search above and press return to search.

అపర చాణక్యుడు బాబుకు సాయం కావాలా..?

By:  Tupaki Desk   |   30 Sep 2022 12:30 AM GMT
అపర చాణక్యుడు బాబుకు సాయం కావాలా..?
X
చంద్రబాబుని మించిన వ్యూహకర్త ఏపీలో ఎవరూ లేరు. అది అంతా అంగీకరించాల్సిన విషయం. వైసీపీ 2017 ప్రాంతంలో తమ పార్టీకి ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్తను తీసుకుని వచ్చింది. ఆ టైం లో అధికారంలో ఉన్న టీడీపీ మంత్రులు, నాయకులు వేళాకోళం చేశారు. మీకు వ్యూహాలు లేక అరువు తెచ్చుకుంటున్నారు. మాకు అయితే చంద్రబాబు ఒక్కరు చాలు అని జబ్బలు చరిచారు.

అయితే పీకే స్ట్రాటజీవో లేక జగన్ పట్ల జనాల ఆదరణో తెలియదు కానీ టీడీపీనే అధికారంలో నుంచి పీకేశారు. చరిత్రలో ఎరగని ఓటమి తరువాత టీడీపీకి తెలిసివచ్చింది ఏంటి అంటే తమ బుర్రలతో పాటు మరిన్ని బుర్రలు కూడా అవసరమని, ఇక చంద్రబాబు గురించి చెప్పుకుంటే ఆయన రాజకీయ చాణక్యుడే. ఇందులో రెండవ మాట లేదు కానీ ఆయన అవుట్ డేటెడ్ అయిపోతున్నారు అని టీడీపీలోనే గుసగుసలు పోతున్న వైనాలు ఉన్నాయి.

ఇపుడు అంతా దూకుడు రాజకీయం మాట వచ్చేలోపు చేతకు రెడీగా ఉండాలి. అలాగే డెసిషన్ వెరీ క్విక్ గా ఉండాలి. నమ్మడం అంటూ చేస్తే గట్టిగా నమ్మేయాలి. తేడా వస్తే చూసుకోవడానికి ప్లాన్ బీ కూడా ఉండాలి. జగన్ ఇదే తీరున వెళ్తున్నారు. ఒకసారి ఒకరిని నమ్మి మోసపోతే జీవితంలో చేరదీయరు. అదే బాబు అలా కాదు, వారు మళ్ళీ వెనక్కి వస్తే ఆదరిస్తారు. దాని వల్ల టీడీపీ నుంచి జంపింగ్స్ ఎక్కువగా చేస్తున్నారు.

ఒకవేళ తాము తిరిగి వచ్చినా బాబు చేర్చుకుంటారు అన్న ధీమా ఉంది. అంతే కాదు, టీడీపీలో పనిచేసే వారికే టికెట్లు అని చెబుతున్నా బాబు నైజం తెలిసిన వారు ధీమాగా ఇంట్లోనే ఉన్నారు. అలా మాటలే కానీ మొహమాటాలకు పోయి బాబే టికెట్లు ఇస్తారు అని కొందరు నాయకుల నమ్మకం. ఇక ఏపీ జనాలను ఎలా కనెక్ట్ కావాలి అన్న దాని మీద కూడా చంద్రబాబు ఇంకా రొడ్డ కొట్టుడు పాలిటిక్స్ నే ఫాలో అవుతున్నారు అని అంటారు.

అందుకే టీడీపీకి కూడా ప్రస్తుత తరానికి తగినట్లుగా వ్యూహకర్తలు కావాల్సి వచ్చింది. దాంతో తొలుత రాబిన్ శర్మ అనే ఆయన్ని తీసుకున్నారు. ఆయన తిరుపతి బై పోల్ కి పనిచేశారని చెబుతారు. కానీ రిజల్ట్స్ తేడా కొట్టాయి. పైగా అప్పట్లో టీడీపీ హిందూత్వ కార్డుతో వెళ్లాలని సలహాలు ఇచ్చింది ఇతగాడే అని చెప్పుకున్నారు. తీరా చూస్తే అవి బెడిసికొట్టాయని చెబుతారు.

ఇక ఆయన ఎక్కువ కాలం పనిచేయకుండానే వెళ్ళిపోయారు. అయితే ఆయన జాతీయ స్థాయిలో సర్వేలు చేస్తున్నారుట. అలా ఆయన స్థాపించిన ఒక సంస్థ ఏపీలో టీడీపీకే అధికారమని ఇచ్చిన సర్వే నమ్మబుల్ గా ఉందా లేదా అన్నది పక్కన పెడితే పొలిటికల్ గా రచ్చ అయితే చేసింది. ఇక ఆయన తరువాత సునీల్ కనుగోలు అనే మరో వ్యూహకర్తను తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంది.

ఆయన టీం గట్టిగా వర్క్ స్టార్ట్ చేస్తోంది అనగానే ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రాజెక్ట్ నే అప్పగించిందట. దాంతో ఆయన టీడీపీ ఫుల్ కి టైం ఇవ్వలేకపోతున్నారుట. ఇది తెలిసి చంద్రబాబు ఆయనతో ఒప్పందం రద్దు చేసుకోవడానికి రెడీ అయిపోయారు. దీంతో టీడీపీకి వ్యూహకర్తలు అంటూ ఎవరూ లేరు. టీడీపీ సామాజిక మాధ్యమాలకు లోకేష్ వ్యూహాలను అందిస్తున్నారు. ఆయన డైరెక్షన్ లో అవి పనిచేస్తున్నాయి.

కానీ పార్టీకి మాత్రం ఎవరూ లేకుండా పోతున్నారు. మరి టీడీపీకి వ్యూహకర్త అవసరమా అంటే ముందే చెప్పుకున్నట్లుగా ఇపుడున్న రాజకీయ వాతావరణంలో అది అవసరమే అని అంటున్నారు. ఇదివరకూ మన బలాలు బలహీనతలు చూసుకుంటే పోయేది. ఇపుడు అలా కాదు ఎదుటి వారి బలాలను కూడా వీక్ చేయడానికి మైండ్ గేం ఆడాలి. ఇంకా ఎన్నో చేయాలి.

అవన్నీ కూడా జనాల్లోకి పోయి పాజిటివ్ ఇంపాక్ట్ రావాలంటే దాని మీదనే కూర్చుని పనిచేసే వారు కావాలి. సో టీడీపీకి అర్జంటుగా ఒక వ్యూహకర్త కావాలి అంటున్నారు. అవతల వైపున వైసీపీ ప్రశాంత్ కిశోర్ టీం తో పని చేయించుకుంటోంది. రానున్న రోజుల్లో ప్రతీ ఎమ్మెల్యేకూ ఒక టీం మెంబర్ ని అటాచ్ చేస్తూ మరింత లోతైన విశ్లేషణతో వైసీపీ ముందుకు సాగాలనుకుంటున్న వేళ ఏడు పదులు దాటిన బాబుకు సాయానికి ఒక వ్యూహకర్త కావాల్సిందే మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.