Begin typing your search above and press return to search.

జ్ఞానవాపి వివాదం ఏంటి? చరిత్ర ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   17 May 2022 7:11 AM GMT
జ్ఞానవాపి వివాదం ఏంటి? చరిత్ర ఏం చెబుతోంది?
X
దేశానికి గుండెకాయలా భావిస్తున్న యూపీ(ఉత్తరప్రదేశ్)లో కొత్త వివాదం ముసురుకుంటోంది. ఆలయాలు కూల్చి వాటిపై మసీదులు నిర్మించారన్న వాదనపై కొత్త చర్చ మొదలైంది. తాజాగా జ్ఞానవాపి (బావి)లో శివలింగం బయటపడడంతో ఇక్కడ ఒకప్పుడు ఆలయం ఉండేదా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జ్ఞానవాపి మసీదు వెనుక పూర్వం ఆలయం ఉండేదని, ఇక్కడ పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ మహిళల తరుపున న్యాయవాది శనివారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసును విచారించిన కోర్టు వీడియోగ్రఫీ సర్వే చేసేందుకు అనుమతి ఇచ్చారు. అయితే వీడియో సర్వే చేస్తుండగా జ్ఞానవాపి బావిలో శివలింగం బయటపడింది. దీంతో ఇక్కడ ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఈ కేసుపై కోర్టు మంగళవారం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనుంది.

ఉత్తరప్రదేశ్ తో ఇంతకాలం బాబ్రీ మసీదు వివాదం కొనసాగింది. మొత్తానికి ఇక్కడ అయోధ్య రామాలయాన్ని నిర్మించాలని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. యూపీలో బాబ్రీ మసీదు తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలున్న మరో మసీదు జ్ఞానవాపి మసీదు. అయితే ఈ మసీదు ఒకప్పటి శివాలయాన్ని కూల్చేసి నిర్మించారని కోర్టును ఆశ్రయించారు. చరిత్ర చెబుతున్న ప్రకారం.. 2000 ఏళ్ల కిందట విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించాడు.

1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేశారు. ఆ తరువాత 1211లో గుజరాత్ కు చెందిన ఓ రాజు ఆలయాన్ని పునరుద్దరించారు. ఆ తరువాత 1458లో మళ్లీ హుస్సేన్ షా షర్కీ హయాంలో కూల్చేసినట్లు చెబుతున్నారు. ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్టించిన తరువాత 1669 ఏప్రిల్ 4న కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చివేసి ఆలయ గోడల మీదుగా మసీదును నిర్మింపజేశాడు.

ఈ క్రమంలో గర్భగుడిలోని విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేస్తారేమోనన్న భయంతో అక్కడి పూజారి శివలింగాన్ని పెకలించి అక్కడే ఉన్నజ్ఞానవాపి(బావి)లో వేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే పూజారి కూడా ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అంటున్నారు. ఆ బావి పేరిటే జ్ఞానవాపి మసీదు అని పేరు వచ్చింది. ఈ మసీదు దక్షిణపు గోడలను పరిశీలిస్తే రాతి శిలాతోరణాలు, చెక్కడాలు కనిపిస్తాయి. దీంతో ఇక్కడ ఆలయం ఉండేదని అనిపిస్తుంది. అయితే ఈ గోడను స్థానిక ముస్లింలు ‘ఖిబ్లాకుడ్యం’గా పరిగణిస్తారు.

1742లో మరాఠా సుబేదార్ మల్హర్ రావు హోల్కర్ కాశీ ఆలయానికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించాడు. అయితే అప్పుడు లఖ్ నవూ నవాబులు పాలిస్తున్నందున ఆయన ప్రయత్నాలు సాగలేదు. అనంతరం ఆయన కోడలు అహిల్యాబాయ్ హోల్కర్ హయాంలో కాశీవిశ్వనాథుడికి ఆలయం ఏర్పడింది. అప్పుడు నిర్మించిందే ఇప్పటి కాశీ విశ్వనాథ ఆలయం. కొందరు ముస్లింలు మాత్రం ఇక్కడ అక్బర్ స్థాపించిన దీన్ -ఇ-ఇలాహీ మతానికి చెందిన కట్టడం ఉండేదని అంటున్నారు.

ఇక జ్ఒాన వాపి మసీదు వెనకాల ఆలయం ఉండేదని ఇక్కడ పూజలకు అనుమతి ఇవ్వాలని 1991 అక్టోబర్ 15న పండిట్ సోమ్ నాథ్ వ్యాస్, డాక్టర్ రామ్ రంగ్ శర్మ తదితరులు వారణాసి కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది. 2019లో సుప్రీం కోర్టు రామాలయాన్ని నిర్మించాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలాజికల్ సర్వే నిర్వమించాలని విజయ్ శంకర్ రస్తోగీ వేరే పిటిషన్ వేశారు. 2021 ఏప్రిల్ 8న కోర్టు దీనిపై ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ అలహాబాద్ కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది.

2021లో ఢిల్లీకి చెందిన విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ అనే సంస్థకు చెందిన ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో జిల్లా కోర్టు జడ్జి రవికుమార్ దివాకర్ ఈ ప్రాంతంలో వీడియో గ్రఫీ, సర్వే నిర్వహించేందుకు ఓ కమిటీని వేశారు. తాజాగా నిర్వహించిన సర్వేలో జ్ఞానవాపిలో శివలింగం బయటపడింది. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తపడాలని స్థానిక కోర్టు అధికారులను ఆదేశించింది.