Begin typing your search above and press return to search.

మినిమం 9 వేల మందికి కరోనా సోకనుంది..!

By:  Tupaki Desk   |   2 April 2020 10:30 AM GMT
మినిమం 9 వేల మందికి కరోనా సోకనుంది..!
X
దిల్లీలోని తబ్లిఘీ జమాత్ మర్కజ్‌ లో ప్రార్థనలకు హాజరైనవారిలో చాలామందికి ఇప్పుడు కరోనా సోకనుందని.. వారి వల్ల మరింతమంది సోకనుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ మత ప్రార్థనలకు 7,600 మంది భారతీయులు - 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించారు. వీరిలో కొందరిని ఇప్పటికే గుర్తించగా వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడీ 9 వేల మంది కరోనా డేంజర్ అంచున ఉన్నారని కేంద్రం అంటోంది. వీరివల్ల ఇంకా ఎంతమందికి సోకుతుందో చెప్పలేమన్నారు.

ఈ మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన వారిని గుర్తించేందుకు 23 రాష్ట్రాలు - నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు నిర్విరామంగా పని చేస్తున్నారు. బుధవారం వరకూ 1,051 మందిని క్వారంటైన్ చేయగా - వారిలో 21 మందికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు మరణించారు.

అయితే, మర్కజ్ ప్రార్థనలతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ గుర్తించడం అధికారులకు కష్ట సాధ్యంగా మారుతోంది. పైగా మర్కజ్ మౌలానా కనిపించకుండాపోవడం.. ఈ ప్రార్థనలకు వచ్చినవారంతా సెల్ఫ్ క్వారంటీన్‌ కు వెళ్లాలని పిలుపునివ్వడంతో వారందరి ఆచూకీ దొరకడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకూ ఈ ప్రార్థనలతో ప్రత్యక్షంగానో - పరోక్షంగానో సంబంధమున్న 400 మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం - ప్రార్థనలతో సంబంధమున్న కేసులు తమిళనాడులో అత్యధికంగా 190 ఉండగా - ఆ తరువాతి స్థానంలో ఏపీ ఉంది. ఏపీలో 71 - ఢిల్లీలో 28 - తెలంగాణలో 28 - ఆసోంలో 14 - మహారాష్ట్రలో 12 - అండమాన్ లో 10 - జమ్మూ కశ్మీర్ లో 6 - పుదుచ్చేరి - గుజరాత్ లో రెండేసి కేసులు పాజిటివ్ వచ్చాయి.