Begin typing your search above and press return to search.

కరోనా పాజిటివ్...తెలంగాణలో 154 - ఏపీలో 152

By:  Tupaki Desk   |   2 April 2020 5:04 PM GMT
కరోనా పాజిటివ్...తెలంగాణలో 154 - ఏపీలో 152
X
నవ్యాంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నాలుగు రోజుల క్రితం దాకా పరిస్థితి అదుపులోనే ఉందన్న భావన వ్యక్తమైనా... ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిలో కరోనా బాధితులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో గడచిన మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయానికి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 152కు చేరింది. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ కేసులే 91గా ఉండటం గమనార్హం. అంటే... ఢిల్లీ లింకులతోనే ఏపీలో కరోనా విజృంభణ అమాంతంగా పెరిగిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే... రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కు చేరితే... కరోనా లక్షణాలతో ఉన్న వారికి సంబంధించిన రిపోర్టులు ఇంకా 409 రావాల్సి ఉందట. ఈ రిపోర్టులలో ఎంత మందికి కరోనా సోకిందన్న విషయంపై అటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గురువారం కొత్తగా నమోదైన కేసుల్లో కృష్ణా - నెల్లూరు - ప్రకాశం జిల్లాలకు చెందిన కేసులే అధికంగా ఉన్నాయి.

మరోవైపు మర్కజ్ లింకులున్న వారి కారణంగానే ఏపీలో కేసులు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం కేసులు 23గా తేలగా... గడచిన రెండు రోజుల్లోనే కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం కేసుల్లో 10 కేసులు ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వారిలో బయటపడగా వారి కారణంగా మరో ఏడుగురికి కరోనా సోకింది. అంటే.. మొత్తం కేసులు 23 అయితే.. వీటిలో 17 కేసులు ఢిల్లీ లింక్డ్ కేసులేనన్న మాట. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోనే ఏపీలో కరోనా విజృంభణ ఈ రేంజిలో ఉందని చెప్పక తప్పదు. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోనూ ఢిల్లీ లింక్డ్ కారణంగానే ఈ మోతాదులో కరోనా కేసులు బయటపడుతున్నాయని చెప్పాలి.

ఇక గురువారం రాత్రి దాకా నమోదైన కేసుల వివరాలు జిల్లాల వారీగా ఎలా ఉన్నాయంటే... నెల్లూరు జిల్లా-24 - కృష్ణా జిల్లా-23 - గుంటూరు జిల్లా-20 - కడప జిల్లా-18 - ప్రకాశం జిల్లా- 17 - పశ్చిమ గోదావరి జిల్లా- 15 - తూర్పు గోదావరి జిల్లా -12 - విశాఖపట్టణం జిల్లా-11 - చిత్తూరు జిల్లా-9 - అనంతపురం జిల్లా-2 - కర్నూలు జిల్లా-1 కేసులు ఉండగా... శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇక ఏపీ కంటే పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన తెలంగాణలో గురువారం ఒక్కరోజే కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే గురువారం రాష్ట్రంలో కొత్తగా మరణాలు అయితే సంభవించలేదు. గురువారం నాటికి తెలంగాణలో మొత్తం కేసులు 154కి చేరింది. అదే సమయంలో గురువారం కొత్తగా వైరస్ నుంచి కోలుకున్న వారు లేకపోగా.. ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కాపాడుకున్న వారి సంఖ్య 17గా తేలింది. మొత్తంగా ఆది నుంచి కరోనా కేసుల సంఖ్యలో ఏపీ కంటే తెలంగాణలోనే అధిక కేసులు నమోదవుతున్నాయని చెప్పాలి. రోజురోజుకు కేసులు పెరుగుతున్న విషయంలో ఏపీ టాప్ లో ఉండగా... మొత్తం కేసుల విషయంలో తెలంగాణనే ఏపీ కంటే ముందుందని చెప్పాలి.