Begin typing your search above and press return to search.

కరోనా పల్లెలకు పాకితే పరిస్థితి ఎట్లా?

By:  Tupaki Desk   |   28 March 2020 6:30 AM GMT
కరోనా పల్లెలకు పాకితే పరిస్థితి ఎట్లా?
X
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్‌ కేసులు వెయ్యికి వేగంగా చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 748 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు నమోదైన కేసులు పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. మహారాష్ట్ర - కేరళ - కర్నాటక రాష్ట్రాల్లో ఈ వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంంది. ఇన్నాళ్లు కరోనా వైరస్‌ కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాగా ఇప్పుడు కరోనా వైరస్‌ రెండో దశకు చేరింది. త్వరలోనే మూడో దశకు చేరుకునే అవకాశం ఉంది. ఈ విధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగితే పల్లెలకు పాకే ప్రమాదం పొంచి ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా గ్రామాలకు కరోనా వైరస్‌ పాకితే భారత్‌ తట్టుకునే పరిస్థితి ఉందా? అనేది సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయం.

ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ బాధితులు - అనుమానితులకు చికిత్స అందించేందుకు వైద్య సదుపాయాలు చాలడం లేదు. ఇక పల్లెలకు పాకితే కరోనా నియంత్రణ కోసం వైద్యులు - వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్‌ కేసులు దేశంలోని గ్రామీణ ప్రాంతాలకూ పాకితే - పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం.

కేసుల సంఖ్య పెరుగుతూ పోతే - గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పడకలు (బెడ్‌ లు) చాలవని జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 26 వేల ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. వీటిలో 21 వేలు గ్రామీణ ప్రాంతాల్లో - 5 వేలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులలోని సౌకర్యాలను గమనిస్తే కరోనా బాధితులకు వైద్యం అందించలేని పరిస్థితి.

పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,700 మంది రోగులకు కేవలం ఒక్క పడక మాత్రమే అందుబాటులో ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 3,100 మందికి ఒక పడక చొప్పున అందుబాటులో ఉంది. ఒక్కో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రి పడకలు - జనాభా నిష్పత్తిని చూస్తే బిహార్‌ అట్టడుగు స్థానంలో ఉంది. తమిళనాడులో వైద్య వ్యవస్థ అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది.

భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 26 వేల మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యులు ఉన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యులు ఉండాలని సూచిస్తోంది. ఈ క్రమంలో దేశంలో 1.1 కోట్ల మంది అల్లోపతి వైద్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో 130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో తగినంత వైద్యులు - వైద్య వసతులు లేవని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రయోగశాలల కొరత కూడా తీవ్రంగా ఉంది. భారత వైద్య పరిశోధన మండలి ఆమోదం పొందిన ప్రభుత్వ ప్రయోగశాలలు దేశంలో 116 ఉండగా వీటిలో 89 ప్రయోగశాలలను కోవిడ్‌ పరీక్ష కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. మరో 27 ప్రయోగశాలలను కూడా వాడుకోనున్నారు.

వీటన్నిటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య - పరిశోధన కేంద్రాలు కొరత తీవ్రంగా ఉంది. వాస్తవంగా సాధారణ పరిస్థితుల్లోనే జనాభాకు అనుగుణంగా వైద్య సేవలు అందుబాటులో లేవు. ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు చాలడం లేదు. వైద్య సేవల కొరత ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాపిస్తే మాత్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు తలచుకుంటే ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ వ్యాపిస్తే వైద్య సేవల కొరత నేపథ్యంలో ఆ వైరస్‌ మరింత వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య సేవలు పెంచితే కరోనాను కొంతమేర కట్టడి చేయవచ్చు.