Begin typing your search above and press return to search.

సజ్జల చెప్పిన కొత్త విషయం...ఇదే శాశ్వతం

By:  Tupaki Desk   |   22 Sep 2022 10:50 AM GMT
సజ్జల చెప్పిన కొత్త విషయం...ఇదే శాశ్వతం
X
ఇప్పటికి రెండున్నరల నెలల క్రితం వైసీపీ తమ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ని ఎన్నుకుంది. నాడు మీడియా అంతా ఇదే హోరెత్తించాయి. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడు జగన్ అన్న విషయం మీద డిబేట్లు కూడా నిర్వహించారు. అసలు అది అయ్యే పనేనా అని కూడా చాలా మంది విమర్శించారు. అయితే నాడు వైసీపీ నాయకులు, ఉత్సాహవంతులు ఏమి చెప్పేరంటే తమిళనాడులో కరుణానిధిని అలా ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, అదే లెక్కన ఏపీలో కూడా సాధ్యపడుతుందని.

పైగా ఇది మామూలు విషయమే అని దేశంలో కొన్ని చోట్ల ఉందని, ఈసీ దీన్ని ఆమోదించి తీరుతుందని కూడా నిబ్బరంగా చెప్పారు. సీన్ కట్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం గట్టి ఝలక్ ఇచ్చేసింది. ఏ పార్టీకైనా ప్రజాస్వామిక విధానాన శాశ్వత అధ్యక్షులు ఎవరూ ఉండరని కూడా స్పష్టం చేసింది. నిర్దిష్ట కాల వ్యవధిలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని కూడా క్లారిటీగా చెప్పేసింది.

ఆ విధంగా వైసీపీ శాశ్వత అధ్యక్షుడు అన్న దాన్ని కొట్టి పారేసింది. దీంతో వైసీపీకి షాక్ అంటూ మీడియా అంతటా మళ్ళీ మోతెక్కింది. దీంతో వైసీపీ ఇరకాటంలో పడిందనే అంతా అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలకు విరుద్ధంగా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని కూడా ఎవరికి తోచిన భాష్యాలను వారు చెప్పేశారు.

మొత్తానికి వైసీపీకి ఇది అతి పెద్ద ట్రబుల్ నే తెచ్చిపెట్టింది అని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైసీపీ నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి బయటకు వచ్చి మీడియాకు కొత్త విషయం చెప్పారు. అసలు వైసీపీలో శాశ్వత అధ్యక్షుడు అన్న ఊసే లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు. పార్టీ ప్లీనరీలో జగన్ శాశ్వత ప్రెసిడెంట్ అంటూ తీర్మానం చేసినా జగన్ దాన్ని తిరస్కరించారు అని ఆయన చెప్పడం విశేషం.

దాంతో ఈ తీర్మానం మినిట్స్ లోకి ఎక్కలేదని కూడా చెప్పుకొచ్చారు. ప్రతీ అయిదేళ్లకు తమ పార్టీ ప్లీనరీ జరుతుందని, పార్టీ ప్రెసిడెంట్ ని అలా ఎన్నుకుంటామని మరో అయిదేళ్ల పాటు జగనే వైసీపీ ప్రెసిడెంట్ అని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని తాము కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెస్తామని పేర్కొన్నారు.

మొత్తానికి వైసీపీ నాయకులే శాశ్వత ప్రెసిడెంట్ జగనే అని అతి ఉత్సాహంతో తీర్మానం చేశారని, జగన్ మాత్రం అలాంటివి తనకు నచ్చవని పక్కన పెట్టారని చెబుతున్నారు. మరి ఇప్పటికి మూడు నెలలుగా ఈ విషయం అయితే లీక్ గా అయినా మీడియాలో ఎక్కడా రాలేదు.

ఇపుడు ఈసీ షాక్ తినిపించిన వేళ మాత్రమే ఇది బయటకు వచ్చింది అంటే మొత్తానికి కిందా మీద పడి హుందాగా సర్దుబాటు చేసుకున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా అతి ఉండాలి కానీ మరీ ఓవర్ అయితేనే ఇలాంటివి వస్తాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు. సో సజ్జల చెప్పారు కాబట్టి జగన్ అయిదేళ్ళ ప్రెసిడెంట్. ప్రస్తుతానికి ఇదే శాశ్వతం అనుకోవాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.