Begin typing your search above and press return to search.

హైదరాబాదీయులా? బహిరంగంగా మద్యం తాగితే తిప్పలే

By:  Tupaki Desk   |   14 Dec 2019 6:34 AM GMT
హైదరాబాదీయులా? బహిరంగంగా మద్యం తాగితే తిప్పలే
X
హైదరాబాదీయులు మరింత ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. లిక్కర్ షాపుల పక్కనే చిన్న అడ్డాల్ని ఏర్పాటు చేయటం.. అక్కడ తాగేయటం లాంటివి మామూలే. ఇకపై.. అలా చేసే వారి విషయంలో కేసులు పెట్టాలని సైబరాబాద్ పోలీసులు డిసైడ్ అయ్యారు. దిశ హత్యాచార ఉదంతం నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

దిశను హత్యాచార ఘటనలో నిందితులు పగలే మద్యం తాగుతూ ఉండిపోతూ.. తమ కంట్లో పడిన దిశను అత్యాచారం చేసిన వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలో పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా బహిరంగంగా మద్యం సేవించే వారిపైన కేసులు పెట్టాలని.. అరెస్టు చేయాలని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు.

వారాంతాల్లో పార్టీల పేరుతో ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవించటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది.

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలు చేస్తున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం బాబులపై ప్రత్యేక నజర్ వేయటంతో పాటు.. వారి విషయంలో కఠినంగా ఉండటం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నది పోలీసుల ఆలోచనగా చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లో మద్యం దుకాణాల పక్కనే స్నాక్స్ అమ్మే దుకాణలు వెలవటం.. అక్కడే తినేస్తూ తాగేస్తున్న తీరుకు చెక్ పెట్టాలన్న యోచనలో పోలీసులు ఉన్నారు.

ఇందులో భాగంగా సైబరాబాద్ పరిధిలోని శివారు ప్రాంతాలపై ప్రత్యేకంగా నజర్ వేయనున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వెంచర్లు.. అటవీ ప్రాంతాలతో పాటు.. నిరుపయోగంగా ఉండే ప్రాంతాలు.. ప్రభుత్వ భవనాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి రోజు రాత్రి వేళలో తనిఖీలు చేయాలని భావిస్తున్నారు. మద్యం దుకాణాలే కాదు.. జనసంచారం పెద్దగా లేని ప్రాంతాల్లో పార్టీల పేరుతో మద్యాన్ని సేవించే వారిపై కేసులు నమోదు చేయటానికి సిద్ధమవుతున్నారు.