Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయంలో ఒకరికి పాజిటివ్..ఎక్కడినుంచి వచ్చారంటే?

By:  Tupaki Desk   |   31 May 2020 6:08 AM GMT
ఏపీ సచివాలయంలో ఒకరికి పాజిటివ్..ఎక్కడినుంచి వచ్చారంటే?
X
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాజిటివ్ లు రాకుండా ఆపలేకపోతోంది ఏపీ సర్కారు. కాకుంటే.. ముప్పును ముందుగా పసిగట్టే పక్కా వ్యవస్థనుసిద్ధం చేయటం కారణంగా.. మాయదారి రోగం విస్తరించకుండా ముందే గుర్తించే అవకాశం కలుగుతోంది. తాజాగా వెలుగుచూసిన రెండు పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ సర్కారు ముందుచూపు కొత్త ప్రమాదాన్ని తప్పించినట్లైంది.

లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండిపోయిన ఏపీ సచివాలయ సిబ్బంది పాటు.. ఇతర కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది పెద్ద ఎత్తున ఉన్నారు. వీరిలో సచివాలయ ఉద్యోగులతో పాటు.. డిపార్ట్ మెంట్ హెడ్డులు ఉన్నారు. అలాంటివారిలో 227 మంది ఉద్యోగుల్ని ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకొచ్చారు.

అలా తెచ్చిన వారిని నేరుగా విధుల్లోకి తీసుకోకుండా వారిని.. తాడేపల్లిలోని కన్వెన్షన్ సెంటర్ కు తీసుకెళ్లి.. ముందస్తు పరీక్షలు నిర్వహించారు. రక్త నమూనాల్ని తీసుకున్నారు. తాజాగా వాటి ఫలితాలు వచ్చాయి. పరీక్షలు జరిపిన వారిలో ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. తాజాగా పాజిటివ్ గా తేలిన వారిలో ఒకరు ఏపీ సచివాలయంలో పని చేసే ఉద్యోగి కాగా.. మరో ఇద్దరు గుంటూరులోని ఒక శాఖ ప్రధాన కమిషనర్ ఆఫీసులో పని చేసే ఉద్యోగులు కావటం గమనార్హం.

ముందస్తు చర్యల్లో భాగంగా నిర్వహించిన పరీక్షలు మరింత మందికి సోకుండా నిలువరించాయని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది మొత్తానికి నిర్దారణ పరీక్షలు జరిపితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో..తెలంగాణతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఏపీ ఉద్యోగుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.