Begin typing your search above and press return to search.

పంత్​ నువ్వు రియల్ హీరో.. ట్విట్టర్లో ప్రశంసల జల్లు

By:  Tupaki Desk   |   6 March 2021 9:30 AM GMT
పంత్​ నువ్వు రియల్ హీరో..  ట్విట్టర్లో ప్రశంసల జల్లు
X
ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్​ తొలి ఇన్సింగ్స్​ లో విధ్వంసకర బ్యాటింగ్​ చేసిన రిషబ్​ పంత్​ ను నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పంత్​కు ప్రశంసలు దక్కుతున్నాయి. కీలక టైంలో పంత్ భారత జట్టును నిలబెట్టాడంటూ అతడిని సీనియర్​ క్రికెటర్లు కీర్తిస్తున్నారు. అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌ తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్​ అదరగొట్టాడు. సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇది అసలు టెస్ట్​ మ్యాచా.. లేక వన్డేనా అన్న రేంజ్​లో విరుచుకుపడ్డాడు. కేవలం 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో విజృంభించాడు. 101 పరుగులు చేసి రూట్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

అయితే టఫ్​ టైంలో బ్యాటింగ్ ​కు దిగిన పంత్​ మొదట నెమ్మదిగా ఆడాడు. చాలా స్లోగా హాఫ్​ సెంచరీ చేసి ఆ తర్వాత సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్‌ సుంద‌ర్‌ తోడయ్యాడు. సుందర్‌ (174 బంతుల్లో 96 నాటౌట్‌), పంత్‌ లు క‌లిసి ఏడో వికెట్‌ కు 113 ప‌రుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీమిండియాకు 157 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించారు. పంత్​, వాషింగ్టన్​ సుందర్​ ఆటతీరుపై ప్రశంసలు దక్కుతున్నాయి. చేజారిపోతుందనుకున్న మ్యాచ్​ను వాళ్లు కాపాడారంటూ ప్రశంసిస్తున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ చైర్మన్​ సౌరవ్‌ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తేశాడు.. ‘పంత్​ నువ్వు నిజమైన విన్నర్​వి.. నీ విధ్వంసకర బ్యాటింగ్​ ఇదే మొదటిది కాదు. ఆఖరిది కాదు.. అన్ని ఫార్మాట్ల క్రికెట్లలో రాణించగలవని మరోసారి అందరికీ గుర్తుచేశావు’ అంటూ గంగూలీ ట్విట్టర్​ లో అభినందించారు.

‘పంత్ నీ ఆటతీరు ఆస్ట్రేలియా ప్లేయర్​ గిల్​క్రిస్ట్​ను గుర్తుచేసింది’అంటూ టీమిండియా మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రశంసించారు. ‘పంత్​ నువ్వే నా నిజమైన వారసుడివి’ అంటూ సెహ్వాగ్​ ప్రశంసించాడు. ఇక సోషల్​ మీడియాలో క్రికెట్​ అభిమానులు, నెటిజన్లు పంత్​, వాషింగ్టన్​ సుందర్​ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీమ్స్ కామెంట్లతో పంత్​ను అభినందించారు. కాగా మూడో రోజు సుందర్ (96) అక్షర్ పటేల్ (43)తో కలిసి పోరాటం చేయడం తో టీమిండియా 365 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. టీమిండియా కీలకమైన 157 పరుగుల ఆధిక్యం సంపాదించగా సుందర్ త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. చివరి వికెట్ గా సిరాజ్ సుందర్ నిరాశగా పెవిలియన్ దారి పట్టాడు.