Begin typing your search above and press return to search.

మోడీ ఆర్మీ యూనిఫామ్.. సోషల్ మీడియాలో గరం గరం

By:  Tupaki Desk   |   18 Nov 2020 2:30 AM GMT
మోడీ ఆర్మీ యూనిఫామ్.. సోషల్ మీడియాలో గరం గరం
X
ఇటీవల దీపావళి సందర్భంగా.. అంతకుముందు చైనాతో ఘర్షణ నెలకొన్న సమయంలో ప్రధాని మోడీ సరిహద్దుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సైనికుల్లో భరోసా నింపేందుకు ఆర్మీ యూనిఫామ్ ధరించారు. దేశభక్తి కోణంలో మోడీ చేసింది రైటే అయినా వరుసగా ఆయన సైనిక దుస్తుల్లో దర్శనమివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ సైనిక దుస్తులు ధరించడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో సైనిక యూనిఫామ్‌ ధరించే హక్కు రాజకీయ నాయకులకు ఉంటుందా లేదా అన్నదానిపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

మోదీ సైనికులతో కలిసి దీపావళి పండుగ తాజాగా జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ సమీపంలో ఉన్న లోంగేవాలా పోస్ట్‌ వద్ద మోదీ సైనిక దుస్తులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మోదీ ఆర్మీ దుస్తులు ధరించడం పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు చేశారు. వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నర్‌వాణె, బీఎస్‌ఎఫ్‌ డీజీ రాకేశ్‌ ఆస్థానా కూడా పాల్గొన్నారు.

సైన్యం నుంచి రిటైరైన వారి దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. “ముందుండి నడిపించే మన ప్రధానికి సెల్యూట్ ” అని లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ఎస్‌ పనాగ్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. దీనిపై కొందరు అభ్యంతరం తెలుపుతూ కామెంట్ చేయడం విశేషం.

‘మోడీకి ఇది ఫ్యాన్సీ డ్రెస్‌ ఈవెంట్‌లాగా ఉంది. కానీ ఆ యూనిఫామ్‌ సాధించడానికి సైనికులు ఎంత కష్టపడతారో ఆయన అర్ధం చేసుకోవాలి. తన భక్తులకు సంతోషం కలిగించడానికి, తన చిన్ననాటి కోరికను తీర్చుకోవడానికి మోదీ ప్రయత్నించారు’’ అని కౌస్తుభ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ కామెంట్ చేశారు.

ఈసారి మనం ఎక్కడ దాడి చేయబోతున్నాం, డెప్‌సాంగ్‌లోనా ? లెఫ్టినెంట్ జనరల్‌ (రిటైర్డ్) ప్రకాశ్‌ కటోచ్‌ సైతం మోడీ సైనిక దుస్తులపై ట్వీట్‌ చేశారు. దానికి సమాధానంగా “ఆయన ఈపాటికి తప్పకుండా అక్కడికి వెళ్లే ఉంటారు...కానీ అది రహస్యం’’ అని హెచ్‌.ఎస్‌.పనాగ్‌ ట్విటర్‌లో రాశారు.

ప్రధానమంత్రి సైనిక యూనిఫామ్‌ ధరించడంపై బ్రిగేడియర్‌ కౌల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “సైనిక యూనిఫామ్‌ వేసుకునే అధికారం ఆయనకు ఎవరిచ్చారు ? ఇది సరికాదని ఆయనకు చెప్పండి’’ అని ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. “ఓహ్‌...ఇది గల్వాన్‌ అనుకుంటా’’ అని మరో ట్విటర్‌ యూజర్‌ కామెంట్‌ చేశారు.

దీనిపై హెచ్‌.ఎస్‌.పనాగ్ స్పందించారు. “ ఆయన కచ్చితంగా గల్వాన్‌, డీబీఓ, పాంగాంగ్‌, కైలాష్‌ పర్వతాలకు వెళ్లి ఉంటారు. కానీ ఆ టూర్‌లు చాలా సీక్రెట్‌గా ఉంటాయి. ఆయనకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. గ్రేట్‌ లీడర్‌’’ అంటూ మోడీ సైనిక దుస్తులను వేసుకోవడాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

రాజకీయ నాయకులు సైనిక యూనిఫామ్‌ ఎలా ధరిస్తారని మరో యూజర్‌ ప్రశాంత్‌ టండన్‌ ప్రశ్నించారు. “సైన్యంతో మనకున్న అనుబంధాన్ని ప్రదర్శించడానికి టోపీలు, జాకెట్లు ధరించడం వరకు ఓకే. కానీ ప్రధాని, రక్షణమంత్రి, ఆఖరికి రాష్ట్రపతి కూడా వీటిని ధరించకూడదు’’ అని ఆయన అన్నారు. “ అయినా లోంగేవాలా లేహ్‌కు 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది’’ అని ఆయన చురక వేశారు.

ప్రమోషన్‌ కోసం వరుణ్‌ ధావన్‌, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా సైనికుల వద్దకు వెళ్లారని, వారి ఉద్దేశం మనోబలాన్ని ఇవ్వడమేని వంశ్‌ వ్యాఖ్యానించారు. మోదీ రాజకీయ నాయకుడు కాకపోతే బాలీవుడ్‌లో ఉండేవారని శిష్ట్లా సత్యనారాయణ అనే యూజర్‌ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. దీనిపై స్పందిస్తూ “ కంగారు పడకండి, ఆయన రాజకీయాల నుండి రిటైర్‌ అయ్యాక కచ్చితంగా బాలీవుడ్‌లో చేరతారు’’ అని మరో యూజర్‌ కామెంట్ చేయడం విశేషం. “ యుద్ధం చైనాలో బోర్డర్‌లో జరుగుతోంది. కానీ మన సార్‌ పాకిస్తాన్‌ సరిహద్దుల్లో శౌర్యం ప్రదర్శిస్తున్నారు’’ అని మరో యూజర్‌ ప్రధానిపై సెటైర్‌ వేశారు.

ఇలా మోడీ సైనిక దుస్తులపై ప్రశంసలు స్ఫూర్తి కంటే విమర్శలే ఎక్కువ రావడం విశేషం.