Begin typing your search above and press return to search.

గంటా బ్యాచ్ అంతా ఒక్కచోట... ?

By:  Tupaki Desk   |   20 Jan 2022 1:30 PM GMT
గంటా బ్యాచ్ అంతా ఒక్కచోట... ?
X
విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ఇమేజ్ ఏంటి అన్నది అందరికీ తెలిసిందే. ఆయన సింగిల్ కాదు, వెంట గణనీయమైన సైన్యం ఎపుడూ ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇలా చాలా మంది ఆయన చుట్టూ ఉంటారు. చాలా మందిని టికెట్లు ఇప్పించి ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత గంటాది . ఆయన ప్రజారాజ్యం ద్వారా ప్రస్తుత వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు, చాలా మంది మాజీ ఎమ్మెల్యేలకు చాన్స్ ఇచ్చారు. ఇక అవంతి శ్రీనివాసరావు గత ఎన్నికల ముందు గంటాతో డిఫర్ అయి వైసీపీలో చేరి మంత్రి అయిపోయారు.

ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తరువాత చాలా మంది నేతలు గంటాను వీడి వైసీపీ గూటికి చేరారు. అయితే వారంతా గంటాను పల్లెత్తు మాట అనలేదు. అదే టైమ్ లో వారు తమదైన పొలిటికల్ లైఫ్ కోసమే అలా చేశారు అని కూడా ప్రచారం జరిగింది. ఇపుడు చూస్తే వీరిలో అంతర్మధనం మొదలైంది అంటున్నారు. వారు తిరిగి టీడీపీలోకి చేరడానికి రెడీ అవుతున్నారు అని కూడా టాక్ నడుస్తోంది.

ఈ మధ్యనే ఎన్టీయార్ వర్ధంతి వేళ గంటా మాట్లాడుతూ టీడీపీలో తాను చంద్రబాబు అడుగు జాడలలో తాను గట్టిగా నిలబడి మరీ పనిచేస్తాను అంటూ తన మీద వస్తున్న పుకార్లకు తెర దించేశారు. దాంతో గంటా 2024 ఎన్నికల్లో టీడీపీలో మళ్లీ చక్రం తిప్పబోతున్నారు అనే అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలోనే విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన గంటాకు సన్నిహితుడే అన్న మాట ఉంది.

మరో వైపు గంటా ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన పంచకర్ల రమేష్ బాబు కూడా ఫ్యాన్ నీడన ఉక్కబోతతో సతమతం అవుతున్నారు అంటున్నారు. ఆయన రాజకీయ గురువు గంటా టీడీపీలో ఉంటే ఆయన కూడా అక్కడికే చేరుకుంటారు అని అంటున్నారు. అధికార పార్టీలో చేరినా తగిన గుర్తింపు లేకపోవడంతో పాటు ఏ రకమైన నామినేటెడ్ పదవి కూడా దక్కకపోవడంతో పంచకర్ల ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు.

మరో మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ నాయకుడు డాక్టర్ ఎస్ ఏ రహమాన్ కూడా సైకిల్ ఎక్కేస్తారు అని అంటున్నారు. ఆయన సైతం గంటాకు బాగా సన్నిహితుడు అన్న మాట ఉంది. ఆయన గంటాతో పాటే ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి తిరిగి 2014లో టీడీపీలోకి వచ్చారు. ఇక వైసీపీలో ఎమ్మెల్సీ సీటుని రహమాన్ ఆశించారు అని అంటారు. వైసీపీ ఈ మధ్యన పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేసింది కానీ రహమాన్ కి అవకాశం ఇవ్వలేదు. ఆ బాధ ఆయనకు ఉందని చెబుతున్నారు.

ఇక గాజువాకకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి కూడా టీడీపీలోకి వస్తారు అన్న ప్రచారం అయితే ఉంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో కూడా గాజువాక టికెట్ హామీ లేదనే అంటున్నారు. అలాగే అనకాపల్లికి చెందిన మరో కీలక నేత కూడా గంటానే గాడ్ ఫాదర్ అంటారు. కార్పోరేషన్ ఎన్నికల ముందు ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. బలమైన సామాజికవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన. ప్రస్తుతానికి ఆయన వైసీపీలో ఉన్నా మనసంతా టీడీపీయే అంటున్నారు. సో ఆయన కూడా వస్తారు అని టాక్ నడుస్తోంది.

ఇలా చాలా మంది నేతలు, మాజీ ఎమ్మెల్యేలు గంటాను కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాలు నడిపే వారు అంతా సొంత గూటికి చేరుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న టాక్ అయితే నడుస్తోంది. అదే జరిగితే విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా హవా మరో మారు స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇంతమంది నేతలతో మందీ మార్బలం కలిగి ఉన్న గంటా మాట టీడీపీలో కచ్చితంగా చెల్లుబాటు అవుతుంది అంటున్నారు. అంగబలం అర్ధబలం సమృద్ధిగా ఉన్న గంటా కనుక టీడీపీలో మళ్లీ చురుకుగా కదిలితే ఈసారి జిల్లాలో వైసీపీకి కష్టాలు మొదలైనట్లే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.