Begin typing your search above and press return to search.

‘‘మీరు కానీ మీ ఇంట్లో వాళ్లు కానీ ఆ గోధుమపిండి తింటే బెయిల్ ఇస్తాం’’

By:  Tupaki Desk   |   10 Jun 2021 4:30 AM GMT
‘‘మీరు కానీ మీ ఇంట్లో వాళ్లు కానీ ఆ గోధుమపిండి తింటే బెయిల్ ఇస్తాం’’
X
అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేసు ఏదైనా కానీ.. క్లయింట్ తరఫున వాదించే లాయర్లు తమ వాదనను వినిపిస్తారే కానీ కీలకమైన పాయింట్లు మిస్ అవుతుంటారు. కొందరు లాయర్ల వాదన వింటే.. మరీ ఇంత దారుణమా? ఇలాంటి కేసుల్ని ఎలా వాదిస్తారన్న సందేహం కలుగుతుంది. అలాంటి తీరునే ప్రదర్శించిన ఒక లాయర్ కు ఊహించని షాక్ ఎదురైంది. బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై వాదన సందర్భంగా సదరు లాయర్ కు మింగాలేని కక్కా లేని పరిస్థితి సుప్రీంలో ఎదురైంది. అరుదుగా చోటు చేసుకునే ఈ పరిణామం ఏమిటన్నది చూస్తే..

మధ్యప్రదేశ్ కు చెందిన పవార్ గోయల్.. వినీత్ గోయల్ అనే ఇద్దరు వ్యాపారులపై గోధుమ పిండి కల్తీ కేసు నమోదైంది. ఈ కేసులో వారికి బెయిల్ ఇవ్వాలంటూ పునీత్ జైన్ అనే లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆహార కల్తీ కేసులో ఆరోపణలకు బెయిల్ ఇవ్వొచ్చని.. కాబట్టి తన క్లయింట్ కు బెయిల్ ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ.. జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం ఊహించని విధంగా స్పందించింది. దేశంలో ఆరోగ్యంపై ఎవరికి పట్టింపు లేకుండా పోయిందన్న బెంచ్.. ‘‘మీరు కానీ.. మీ ఫ్యామిలీలోని వారు కానీ మీ క్లయింట్ తయారు చేసి అమ్ముతున్న గోధుమపిండిని తింటే బెయిల్ ఇస్తాం. అందుకు మీరు సిద్ధమేనా?’’ అని సూటిగా ప్రశ్నించింది.

సుప్రీం ధర్మాసనం ఈ తీరులో రియాక్టు అయ్యేసరికి సదరు లాయర్ కు ఏ రీతిలో స్పందించాలో అర్థం కాలేదు దీంతో మరోసారి స్పందించిన ధర్మాసనం.. తాము అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అని ప్రశ్నించింది. ‘ఇతరుల ప్రాణాలైతే పోతే పోనీ.. మాకేంటి అనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించటంతో మరో మాట మాట్లాడకుండా తన పిటిషన్ ను సదరు లాయర్ వెనక్కి తీసుకున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.