Begin typing your search above and press return to search.

అయితే.. ఆ `లేడీ` చ‌ట్టాలు ఎత్తేయొచ్చా!

By:  Tupaki Desk   |   29 Nov 2021 3:30 PM GMT
అయితే.. ఆ `లేడీ` చ‌ట్టాలు ఎత్తేయొచ్చా!
X
చిత్రంగా అనిపించినప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. ``ఇక‌, ఆ లేడీస్ చ‌ట్టాలు తీసేయండి!``-``పోలీసులూ.. భ‌ర్త‌ల‌ను ఏమీ అన‌కండి!``-``దేశంలో భ‌ర్త‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టే!``-``భ‌ర్త‌లూ ఇక రెచ్చిపోండి`` అంటూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. ఇంత‌కీ ఇంత హంగా మా వెనుక‌.. ఈ కామెంట్లు వెనుక ఏం జ‌రిగింది? అనూహ్యంగా ఈ కామెంట్ల వ‌ర‌ద ఏంటి? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారా.? అక్క‌డికే వ‌స్తున్నాం. భారత్ వంటి అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశాల్లో పురుషాధిక్య స‌మాజం ఉంద‌ని.. దీనివ‌ల్ల మ‌హిళ‌లు నిత్యం ఇంట్లో క‌ష్టాలు అనుభ‌విస్తున్నార‌ని.. మ‌న పాల‌కులు గ‌తంలో తేల్చారు.

అంతేకాదు.. ప్ర‌ధానంగా భ‌ర్త‌ల నుంచి భార్య‌ల‌కు నిత్యం వేధింపులు వ‌స్తున్నాయ‌ని వారు తీర్మానించారు. ఈ క్ర‌మంలోనే గృహ హింస నిరోధక చ‌ట్టాన్ని కొన్నేళ్ల కింద‌ట తెచ్చారు. భ‌ర్త‌ల చేతుల్లో త‌న్నులు తినే భార్య‌ల‌కు.. ఈ చ‌ట్టం అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. చాలా చోట్ల ఈ చ‌ట్టం కింద కేసులు కూడా న‌మోద‌వుతున్నాయి. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు భ‌ర్త‌లు ఒకింత ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని భార్య‌ల‌ను నొప్పించ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం చేసిన జాతీయ‌ కుటుంబ స‌ర్వేలో.. ఒక సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది.


కొన్ని పరిస్థితుల్లో భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనైతే ఇలాంటి మహిళల శాతం ఏకంగా 84శాతంగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్ఎఫ్ఎస్‌)-5 ఈ మేరకు వివరాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా.. "భార్యను భర్త కొట్టడం మీ అభిప్రాయంలో సబబేనా?"అనే ప్రశ్నను మహిళల ముందుంచారు.

భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం, అత్తింటివారిని ఆమె గౌరవించకపోవడం, మొగుడితో వాదనకు దిగడం, భర్తతో శృంగారానికి నిరాకరించడం, ఆయనకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని/పిల్లలను నిర్లక్ష్యం చేయడం, మంచి ఆహారాన్ని వండకపోవడం వంటి పరిస్థితులు తలెత్తినట్లు ఊహించుకొని సమాధానాలు చెప్పాలని వారికి సూచించారు. దీనికి భార్య‌లు అంతే జాగ్ర‌త్త‌గా స‌మాధానాలు చెప్పారు.

మూడు రాష్ట్రాల్లో 75శాతంపైగా మహిళలు.. భార్యను భర్త కొట్టడం సబబేనని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వారి శాతం 84 శాతంగా (సర్వేలో పాల్గొన్నవారిలో) ఉండగా.. కర్ణాటకలో 77శాతంగా నమోదైంది. మణిపుర్‌ (66శాతం), కేరళ (52శాతం), జమ్మూ-కశ్మీర్‌ (49శాతం), మహారాష్ట్ర (44శాతం), బంగాల్‌ (42శాతం)ల్లోనూ మొగుడు చితకబాదడాన్ని సమర్థించే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఇంటిని/పిల్లల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అత్తింటివారిని గౌరవించనప్పుడు భార్యను భర్త కొట్టడం సమంజసమేనని అత్యధిక మంది మహిళలు అభిప్రాయపడ్డారు. అత్తింటివారిని గౌరవించకపోవడాన్ని ప్రధాన కారణంగా తెలంగాణ సహా 13 రాష్ట్రాల మహిళలు పేర్కొన్నారు. అత్యల్పంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో 14.8శాతం మహిళలు మొగుడు కొట్టడాన్ని సమర్థించారు. దీంతో ఇప్పుడు.. భ‌ర్త‌ల‌కు భార్య‌లే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని.. నె టిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో గృహ హింస వంటి చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని.. మోడీ దీనిపైనా దృష్టి పెట్టి.. సాగు చ‌ట్టాల మాదిరి దీనిని కూడా ర‌ద్దు చేయాల‌ని కామెంట్ చేస్తున్నారు.