Begin typing your search above and press return to search.

నిజాయితీపరులకు మోడీ 'పన్ను'దన్ను...కొత్త విధానం షురూ

By:  Tupaki Desk   |   13 Aug 2020 12:10 PM GMT
నిజాయితీపరులకు మోడీ పన్నుదన్ను...కొత్త విధానం షురూ
X
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థికరంగంలో జీఎస్టీతో సహా పలు కీలకమైన సంస్కరణలు చేపట్టారు. పన్ను చెల్లించేవారికోసం ఎన్నో సదుపాయాలు కల్పించారు. పన్నుల చెల్లింపునకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ - ఇన్ కమ్ ట్యాక్స్ (CBDT) ఇటీవల ఎన్నో సంస్కరణలను తెచ్చింది. గత ఏడాది కార్పొరేట్ ట్యక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడమే కాకుండా నూతన తయారీ యూనిట్లకు ఈ రేటును 15 శాతానికి తగ్గించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌‌ను కూడా తొలగించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పన్ను విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ఆదాయపు పన్ను విభాగంలో మరో కీలకమైన పథకాన్ని మోడీ ప్రారంభించారు. 'ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ - హానరింగ్ ది హానెస్ట్ (పారదర్శక పన్ను విధానం-నిజాయితీపరులకు గౌరవం)' వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారుల కోసం మరింత సరళమైన, సౌకర్యవంతమైన విధానాన్ని మోడీ ప్రకటించారు. ఇకపై పన్ను చెల్లింపుదారులు స్క్రుటినీ కోసం, అప్పీళ్ల కోసం నేరుగా హాజరయ్యే అవసరం లేకుండా ఉండే విధానాన్ని తీసుకువచ్చారు. వచ్చే నెల 25 నుంచి ఫేస్‌లెస్ అప్పీళ్లు (నేరుగా హాజరుకాకుండా) ప్రారంభమవుతాయని మోడీ పేర్కొన్నారు. సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి దేశ నిర్మాణానికి తోడ్పాటునందించాలని ప్రజలను మోడీ అభ్యర్థించారు.

అతి తక్కువ కార్పొరేట్ పన్నులను వసూలు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటని, భారత పన్ను వ్యవస్థలో ప్రాథమిక సంస్కరణలు అవసరమని మోడీ అన్నారు. పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడం, నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని ప్రోత్సహించడం కొత్త విధానం ఉద్దేశ్యమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. పార‌దర్శ‌క ప‌న్నువిధానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అతిపెద్ద సంస్క‌ర‌ణగా మోడీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు, ఇటు అధికారులకు సంబంధించిన హక్కులు, బాధ్యతలను నిర్దేశించే ‘‘పన్ను చెల్లింపుదారుల చార్టర్’’ కూడా ఐటీ శాఖ అమలుచేయనుందని చెప్పారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌, ట్యాక్స్ పేయ‌ర్ చార్ట‌ర్‌లు నేటి నుంచే అమ‌లులోకి వ‌స్తాయన్నారు. ఫేస్‌లెస్ అపీల్ సేవ‌లు మాత్రం సెప్టెంబ‌ర్ 25 నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పన్నుదారులు ఇబ్బందులు పడకుండా, నేరుగా హాజ‌రు కాకుండా ఉండే విధంగా, స‌క్ర‌మంగా ప‌న్నులు చెల్లిస్తున్న‌వారిని మ‌రింత ప్రోత్స‌హిస్తామ‌ని అన్నారు. ప‌న్ను విధానాన్ని సరళతరం చేసి, చెల్లింపుదారులను మ‌రింత శ‌క్తివంతంగా త‌యారు చేయ‌డ‌మే ప్ర‌ధాని మోదీ ల‌క్ష్య‌మ‌ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.