Begin typing your search above and press return to search.

నరేంద్ర గిరి స్వామి మృతి కేసు .. సీబీఐ చేతుల్లోకి

By:  Tupaki Desk   |   24 Sep 2021 2:30 PM GMT
నరేంద్ర గిరి స్వామి మృతి కేసు .. సీబీఐ చేతుల్లోకి
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరేంద్రగిరి అఖాడా కేసు దర్యాప్తుకు రంగంలోకి దిగింది సీబీఐ. మహంత్‌ నరేంద్రగిరిది హత్య, ఆత్మహత్య అన్న అంశంపై నిజాలు నిగ్గు తేల్చనుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన నరేంద్రగిరి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తుకు సిఫార్స్‌ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌. దీంతో దర్యాప్తుకు అంగీకరించిన సీబీఐ, ఈ కేసు విచారణకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనుంది ఆరుగురు సభ్యుల బృందం. ఇక ఇప్పటికే నరేంద్రగిరి అఖాడా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తోంది సిట్‌. ఆత్మహత్య, హత్య అన్న కోణంలో విచారిస్తోంది. ఐతే సూసైడ్‌ అయితే నరేంద్రగిరికి ఆ అవసరం ఎందుకొచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక ఆధారాల ప్రకారం నరేంద్రగిరిది ఆత్మహత్యగా చెబుతున్నారు..కానీ అతని శిష్యులు మాత్రం ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర గిరి మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ తర్వాతే క్లారిటీ వస్తుందని అంటున్నారు. మహంత్ నరేంద్ర గిరి ఈ నెల 20న ప్రయాగరాజ్ బాఘంబరి గడ్డి మఠంలోని తన గదిలో శవమై కనిపించారు. ఉరి కారణంగా ఆయన ఊపిరాడక మరణించినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. ఐతే నరేంద్రగిరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ముగ్గురిని అరెస్ట్‌ చేశారు యూపీ పోలీసులు.

కాగా, ఈ కేసులో నరేంద్ర గిరి శిష్యుడు, ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆనంద్ గిరిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో ఆనంద్ గిరిని ఆశ్రమం నుంచి బహిష్కరించారు. తన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్‌ గిరితో పాటు మరో ఆధ్య తివారి, అతడి కుమారుడు సందీప్‌ తివారి కారణమని నరేంద్ర గిరి సూసైడ్‌ నోట్‌ లో రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అటు, ఈ ఘటనపై పలువురు సాధువులు అనుమానాలు వ్యక్తంచేయడంతో కేసు దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం తొలుత సిట్‌ ఏర్పాటు చేసింది. కానీ, మరింత లోతైన దర్యాప్తు కోసం సీబీఐకి బాధ్యతలను అప్పగించింది. నరేంద్ర గిరి మరణంపై పలు ఆధారాలను సేకరించామని, కుట్రదారులు తప్పించుకోలేరని సీఎం యోగి పేర్కొన్నారు.

స్వామీజీ అనుమానాస్పద మరణంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష కాంగ్రెస్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. ఘటనలో వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. పోస్ట్‌మార్టం నిర్వహించకుండా ఆత్మహత్యగా చెప్పాలని పోలీసులను ఎవరు ఒత్తిడి చేశారని ఆరోపించారు.